T20 WC 2022: ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ అవార్డు రేసులో 9 మంది! కోహ్లితో పాటు: ఐసీసీ ప్రకటన

11 Nov, 2022 15:46 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

ICC Men's T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ఆరంభమైన టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. మెల్‌బోర్న్‌ వేదికగా నవంబరు 13న ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు కోసం పోటీలో నిలిచిన తొమ్మిది క్రికెటర్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాజాగా వెల్లడించింది.

ఈ జాబితాలో ఉన్న తమకు నచ్చిన ఆటగాడికి ఓటు వేసే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేసింది. కాగా ఈ లిస్టులో భారత్‌ నుంచి ఇద్దరు, పాకిస్తాన్‌ నుంచి ఇద్దరు, ఇంగ్లండ్‌ నుంచి ముగ్గురు, జింబాబ్వే నుంచి ఒకరు, శ్రీలంక నుంచి ఒకరు చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ షార్ట్‌లిస్టులో ఉన్న క్రికెటర్లు వీరే
1. విరాట్‌ కోహ్లి (భారత్‌)- 296 పరుగులు- 6 మ్యాచ్‌లలో
2. సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత్‌)- 239 పరుగులు- 6 మ్యాచ్‌లలో
3. షాదాబ్‌ ఖాన్‌ (పాకిస్తాన్‌)- 10 వికెట్లు, ఒక అర్ధ శతకం- 6 మ్యాచ్‌లలో
4. షాహిన్‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌)- 10 వికెట్లు- 6 మ్యాచ్‌లలో
5. సామ్‌ కరన్‌ (ఇంగ్లండ్‌)- 10 వికెట్లు- 5 మ్యాచ్‌లలో

6. జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌)- 199 పరుగులు- 5 మ్యాచ్‌లలో- కెప్టెన్‌గానూ విజయవంతం
7. అలెక్స్‌ హేల్స్‌ (ఇంగ్లండ్‌)- 211 పరుగులు- 5 మ్యాచ్‌లలో 
8. సికిందర్‌ రజా(జింబాబ్వే)- 219 పరుగులు-8  మ్యాచ్‌లలో- 10 వికెట్లు
9. వనిందు హసరంగ (శ్రీలంక)- 15 వికెట్లు- 8 మ్యాచ్‌లలో

అదరగొట్టిన కోహ్లి, సూర్య.. అయితే
ఇక ఈ మెగా టీ20 టోర్నీలో టీమిండియా సెమీస్‌ దశలోనే ఇంటిబాట పట్టినప్పటికీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, మిడిలార్డర్‌ మేటి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సూపర్‌-12 దశ ముగిసే సరికి కోహ్లి 246 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా  నిలవగా.. సూర్యకుమార్‌ 225 పరుగులతో టాప్‌-10 జాబితాలో మూడో స్థానం ఆక్రమించాడు. సూపర్‌-12 ముగిసే నాటికి ఐసీసీ ప్రకటించిన ఈ బ్యాటర్ల జాబితాలో పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ క్రికెటర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. 

బట్లర్‌, హేల్స్‌ ఒక్క మ్యాచ్‌తో
ఇదిలా ఉంటే.. బౌలర్ల లిస్ట్‌లో మాత్రం షాదాబ్‌ ఖాన్‌ 10 వికెట్లతో ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక రెండో సెమీ ఫైనల్లో టీమిండియాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ బ్యాటింగ్‌ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్లర్‌ 80, హేల్స్‌ 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చారు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి 50 పరుగులు సాధించగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు.  

చదవండి: WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు
Sania- Shoaib: సానియా- షోయబ్‌ విడాకుల రూమర్లు! మోడల్‌తో మాలిక్‌ ఫొటోలు వైరల్‌.. మీ భర్త కూడా ఇలాగే..
T20 WC 2022: 'టీమిండియా కోచ్‌గా అతడిని చేయండి.. కెప్టెన్‌గా అతడే సరైనోడు'

మరిన్ని వార్తలు