IND vs BAN T20 WC 2022: వ్యాట్‌ ఏ మ్యాచ్‌.. మజా వచ్చిందిగా!

2 Nov, 2022 18:18 IST|Sakshi

పొట్టి ప్రపంచకప్‌లో మరోసారి అసలు సిసలు మజా వచ్చింది. భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతి వరకు దోబూచులాడిన విజయం ఆఖరికి టీమిండియాను వరించింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాతో సాగిన ఉ‍త్కంఠభరిత పోరులో 5 పరుగులతో విజయం సాధించి భారత్‌ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గెలుపోటములు ఎలా ఉన్నా ఈ మ్యాచ్‌ మాత్రం క్రికెట్‌ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది.

పాకిస్తాన్‌తోనూ ఇలాగే జరిగిన తన తొలి మ్యాచ్‌లో భారత్‌ చివరి బంతికి అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ విరాట్‌ కోహ్లి అర్ధ సెంచరీలతో అదరగొట్టి  ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకోవడం విశేషం. 

నరాలు తెగే ఉత్కంఠ
చివరి ఓవర్‌కు 20 పరుగులు చేయాల్సిన దశలో బంగ్లాదేశ్‌ చూపిన తెగువ క్రీడాభిమానులకు ఆకట్టుకుంది. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన చివరి ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ బాది విజయానికి చేరువగా వచ్చింది. చివరి మూడు బంతులను అర్ష్‌దీప్‌ జాగ్రత్తగా సంధించడంతో భారత్‌ విజయాన్ని అందుకుంది. కీలక సమయంలో రాణించి అర్ష్‌దీప్‌ అదుర్స్‌ అనిపించుకున్నాడు.

చివరి ఓవర్‌ సాగిందిలా..
మొదటి బంతి: టాస్కిన్‌ సింగిల్‌ తీశాడు
రెండో బంతి: నూరుల్‌ భారీ షాట్‌ ఆడి సిక్సర్‌గా మలిచాడు
మూడో బంతి: అర్ష్‌దీప్‌ అద్భుత స్వింగ్‌.. పరుగు రాలేదు
నాలుగో బంతి: నూరుల్‌ రెండు పరుగులు పిండుకున్నాడు. 
ఐదో బంతి: నూరుల్‌ ఫోర్‌ బాదడంతో మళ్లీ ఉత్కంఠ
ఆరో బంతి: సింగిల్‌ మాత్రమే రావడంతో భారత్‌ విజయకేతనం

మరిన్ని వార్తలు