T20 WC: అదరగొట్టాడు.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం ఖాయం: ఆకాశ్‌ చోప్రా

5 Nov, 2021 11:01 IST|Sakshi
PC: ICC

Aakash Chopra feels IPL teams will be interested in buying This Player: శ్రీలంక యువ క్రికెటర్‌ చరిత్‌ అసలంక టీ20 వరల్డ్‌కప్‌-2021లో సత్తా చాటాడు. ఇప్పటి వరకు టోర్నీలో 6 ఇన్నింగ్స్‌ ఆడిన 24 ఏళ్ల అసలంక 231 పరుగులు చేశాడు. తద్వారా ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ప్రపంచకప్‌-2021లో రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు అసలంక. 

ముఖ్యంగా నవంబరు 4 నాటి వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 41 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో.. 68 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా క్రీడా ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ క్రమంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ చరిత్‌ అసలంక గురించి టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని ఈ శ్రీలంక బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు. 

రానున్న ఐపీఎల్‌ వేలంలో అసలంక కోసం ఫ్రాంఛైజీలు తప్పక ఆసక్తి చూపుతాయని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు... ‘‘ చరిత్‌ అసలంక రియల్‌ డీల్‌. టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అతడిని దక్కించుకునేందుకు.. వేలంలో ఐపీఎల్‌ జట్లు ఆసక్తి కనబరుస్తాయని భావిస్తున్నాను’’ అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లలో వరుస విజయాలు నమోదు చేసి సూపర్‌ 12 కు అర్హత సాధించిన శ్రీలంక జట్టు.. సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది. సూపర్‌ 12 రౌండ్‌లో 5 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి నాకౌట్‌ దశలోనే వెనుదిరిగింది.   

చదవండి: Chris Gayle: ఏంటిది గేల్‌.. చెత్త రికార్డు...ఇన్ని ఘనతలు ఉన్నా.. శ్రీలంకపై మాత్రం..

మరిన్ని వార్తలు