T20 WC 2022: పంత్‌కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్‌ దిగ్గజం

23 Sep, 2022 14:43 IST|Sakshi
రిషభ్‌ పంత్‌

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌-2022 భారత తుది జట్టులో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. పంత్‌తో పాటు దినేశ్‌ కార్తిక్‌ కూడా చోటు ఇవ్వాలని సూచించాడు. ఈ ఇద్దరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

ఇటీవలి కాలంలో టీ20 ఫార్మాట్‌లో రిషభ్‌ పంత్‌ గణాంకాల దృష్ట్యా అతడికి ప్రపంచకప్‌ తుదిజట్టులో చోటు ఇవ్వకూడదంటూ విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వసీం జాఫర్‌ వంటి టీమిండియా మాజీలు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పంత్‌ను కాదని దినేశ్‌ కార్తిక్‌కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

ఇక ఐసీసీ మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదటి టీ20లో పంత్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ మాజీ వికెట్‌ కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌.. పంత్‌కు ప్రపంచకప్‌ తుది జట్టులో స్థానం ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడు మెరుగ్గా రాణించగలడని పేర్కొన్నాడు.


గిల్‌క్రిస్ట్‌

ఈ మేరకు ఐసీసీతో గిల్‌క్రిస్ట్‌ మాట్లాడుతూ.. ‘బౌలర్లపై విరుచుకుపడుతూ అద్భుత షాట్లు ఆడ గల సత్తా పంత్‌కు ఉంది. తను కచ్చితంగా తుది జట్టులో ఉండాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఇక అదే విధంగా దినేశ్‌ కార్తిక్‌ ఆట తీరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పంత్‌తో పాటు డీకే కూడా జట్టులో ఉండాలి. 

అతడొక విలక్షణమైన బ్యాటర్‌. టాపార్డర్‌లో.. మిడిలార్డర్‌లోనూ ఆడగలడు. ఫినిషర్‌గా అద్భుత పాత్ర పోషించగలడు. అందుకే అతడికి కూడా జట్టులో చోటు దక్కాల్సిందే’’ అని ఆడం గిల్‌క్రిస్ట్‌ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం కానుంది.

చదవండి: Dewald Bravis: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా!

Poll
Loading...
మరిన్ని వార్తలు