T20 WC 2022 Final: బాబర్‌కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్‌

14 Nov, 2022 12:24 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ రన్నరప్‌గానే మిగిలిపోయింది. పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌ రెండోసారి పొట్టి ఫార్మాట్‌లో చాంపియన్‌గా అవతరించింది. బెన్‌ స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు తోడుగా జట్టు సమిష్టి ప్రదర్శన ఇంగ్లండ్‌కు విజయాన్ని కట్టబెట్టింది. ఇక మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబార్‌ ఆజంకు ఐపీఎల్‌ రూపంలో ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనిపై బాబర్‌ ఏం స్పందించలేదు. అయితే మీడియా మేనేజర్‌ మధ్యలో తలదూర్చి ప్రశ్న అడిగిన జర్నలిస్ట్‌కు కౌంటర్‌ ఇచ్చాడు.

ప్రెస్‌మీట్‌లో భాగంగా ఒక జర్నలిస్ట్‌ మాట్లాడుతూ.. "ఐపీఎల్‌ వల్ల జరుగుతున్న మేలు గురించి మాట్లాడుకుందాం. బాబర్‌ ఒకవేళ మీకు కానీ లేదా జట్టు సభ్యుల్లో ఐపీఎల్‌ ఆడే అవకాశం వస్తే ఆడుతారా లేకపోతే వదులుకుంటారా" అని ప్రశ్న వేశాడు. దీనికి బాబర్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వెంటనే తన మీడియా మేనేజర్‌వైపు తిరిగాడు. ''ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌ గురించి మాత్రమే ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. వేరే విషయాల ప్రస్తావన ఎందుకంటూ'' చురకలంటించాడు.

ఇక ఈసారి టి20 ప్రపంచకప్‌లో 1992 సీన్‌ రిపీట్‌ అవుతుందని చాలా మంది భావించారు. కానీ ఇంగ్లండ్‌ బౌలర్ల ముందు పాకిస్తాన్‌ పప్పులు ఉడకలేదు. అదే విషయాన్ని బాబర్‌ స్పష్టం చేశాడు. గత మూడు మ్యాచ్‌ల నుంచి చూసుకుంటే మేం సాధించిన విజయాలతో కాస్త ఉత్సాహంగానే ఉన్నా. కానీ ఫైనల్లో పరాజయం చెందడం కాస్త బాధ కలిగించింది. అయితే ఇంగ్లండ్‌ మంచి ఆటతీరును ప్రదర్శించింది. మ్యాచ్‌లో చివరకు ఒకరిని మాత్రమే విజయం వరిస్తుంది. అయితే మా పేస్‌ దళం బలంగా ఉండడంతో స్ట్రాటజీ వర్క్‌ చేస్తున్నట్లగా అనిపించింది. కానీ స్టోక్స్‌ ఆఖరివరకు నిలబడి మ్యాచ్‌ను మా చేతుల్లోంచి లాగేసుకున్నాడు. గెలవాలన్న తాపత్రయం మాలో ఉన్నప్పటికి కొన్ని పరిస్థితులు మాకు అనుకూలంగా లేకపోవడంతో ఓటమి చెందాల్సి వచ్చింది. కానీ ఫైనల్లో మా ప్రదర్శనతో సంతృప్తిగానే ఉన్నాం.''  అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి:  మొయిన్‌ అలీ, రషీద్‌ విషయంలో బట్లర్‌ పెద్ద మనసు

మరిన్ని వార్తలు