T20 World Cup 2022: బుమ్రా విషయంలో కోచ్‌ ద్రవిడ్‌ క్లారిటీ

1 Oct, 2022 18:58 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ నుంచి టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వైదొలిగినట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బుమ్రా టి20 ప్రపంచకప్‌కు దూరమైనట్లు బీసీసీఐ ఇప్పటిదాకా అధికారికంగా ఎక్కడా పేర్కొనలేదు. కేవలం సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే బుమ్రా దూరమయ్యాడని.. ప్రస్తుతం ఎన్‌సీఏ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది. 

ఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బుమ్రా విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. ''ఇప్పటివరకు చూసుకుంటే బుమ్రా గాయంతో కేవలం సౌతాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్‌కు మాత్రమే దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఎన్‌సీఏ నుంచి రాబోయే అధికారిక రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నాం.

మరో రెండు, మూడు రోజుల్లో బుమ్రా గాయంపై అధికారిక సమాచారం వస్తుంది. అప్పుడు మీకు షేర్‌ చేస్తాం. అప్పటివరకు బుమ్రా టి20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉన్నట్లే. ఒక ముఖ్యమైన బౌలర్‌ గాయపడలేదంటే అది మాకు సంతోషమే. ఈ పరిస్థితుల్లో బుమ్రా తొందరగా కోలుకోవాలని.. టి20 ప్రపంచకప్‌లో ఆడాలని కోరుకుంటున్నాం. మెడికల్‌ రిపోర్ట్స్‌ను నేను లోతుగా చూడలేదు. వాటిని చూడడానికి నిపుణులు ఉంటారు. వాళ్లే బుమ్రా గాయంపై స్పష్టత ఇస్తారు. ఇప్పటికైతే బుమ్రా టి20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉన్నట్లే'' అంటూ తెలిపాడు.

కాగా శుక్రవారం గంగూలీ కూడా బుమ్రా గాయం విషయంలో ఇదే రీతిలో స్పందించాడు. ''బుమ్రా ఇంకా దూరం కాలేదు..  ఆడే అవకాశాలున్నాయి'' అంటూ హింట్‌ ఇచ్చాడు.  ఇక సౌతాఫ్రికాతో జరగనున్ను మిగతా రెండు టి20లకు జట్టు మేనేజ్‌మెంట్‌ బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను ఎంపిక చేసింది.ఇక గాయంతో చాలా నెలల పాటు దూరంగా ఉన్న బుమ్రా ఇటీవలే ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టి20లో ఆడాడు.

ఆ మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీసిన బుమ్రా.. మూడో టి20లో మాత్రం విఫలమయ్యాడు. 4 ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. ఇక బుమ్రా గాయపడిన వేళ అదనపు బౌలర్ల అవసరం ఉందని గుర్తించిన బీసీసీఐ.. మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లను అక్టోబర్‌ 6న ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న టీమిండియా జట్టుతో కలిసి పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చదవండి: 'బుమ్రా దూరం కాలేదు..'

మరిన్ని వార్తలు