Harbhajan Singh: గత రికార్డులు శుద్ధ దండుగ.. అఫ్గన్‌ను తేలికగా తీసుకోవద్దు!

3 Nov, 2021 13:50 IST|Sakshi

Harbhajan Singh- India cannot take Afghanistan lightly: అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ను తేలికగా తీసుకోవద్దని టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కోహ్లి సేనను హెచ్చరించాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ టోర్నీలో అఫ్గన్‌ అద్భుత ఫామ్‌తో దూసుకుపోతుందని జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ రూపంలో నబీ బృందానికి చక్కటి స్పిన్‌ ద్వయం ఉందని.. వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే మెరుగైన ఫలితాలు దక్కుతాయని అభిప్రాయపడ్డాడు.

కాగా పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో వరుస పరాజయాల తర్వాత టీమిండియా..  నవంబరు 3(బుధవారం)న అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఇక ఇప్పటికే కోహ్లి సేనకు సెమీస్‌ చేరే అవకాశాలు సంక్లిష్టం కావడంతో అఫ్గన్‌తో మ్యాచ్‌ కీలకంగా మారింది. ఓవైపు పాకిస్తాన్‌ వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కు చేరగా.. కివీస్‌ అవకాశాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి.

మరోవైపు.. అఫ్గనిస్తాన్‌ సైతం ఈసారి సూపర్‌ 12కు నేరుగా అర్హత సాధించడమే గాక.. స్కాట్లాండ్‌, నమీబియాలపై భారీ తేడాతో విజయం సాధించి.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.  ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడిన హర్భజన్‌ సింగ్‌... ‘‘అఫ్గనిస్తాన్‌ను తేలికగా అంచనా వేయకూడదు. ఆ జట్టు ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఆడుతోంది. బ్యాటర్లు రాణిస్తున్నారు.

బౌలింగ్‌ విభాగంలో ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌- రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ ద్వయం.. సూపర్‌ కాంబినేషన్‌. పొట్టి ఫార్మాట్‌లో ఆఖరి వరకు ఉత్కంఠగానే ఉంటుంది. ఏ జట్టు గెలుస్తుంది.. ఏ జట్టు ఓడుతుంది అన్న విషయాలను ముందుగానే అంచనా వేయలేం. మొదటి ఆరు ఓవర్ల తర్వాత ఏ జట్టు అయితే పటిష్ట స్థితిలో ఉంటుందో.. వాళ్లకే కాస్త అడ్వాంటేజ్‌ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. 

ఇక గతంలో టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా... అఫ్గన్‌ను టీమిండియా రెండుసార్లు మట్టికరిపించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ.. ‘‘ఓ క్రికెటర్‌గా గత రికార్డులపై నేను అంతగా విశ్వసించను. అసలు అలాంటి గణాంకాలు నా దృష్టిలో శుద్ధ దండుగ. గతంలో జరిగింది అచ్చంగా అలాగే జరుగుతుందని అనుకోకూడదు. ఉదాహరణకు గతంలో మనం పాకిస్తాన్‌ను 12 సార్లు ఓడించాం.

కాబట్టి పదమూడోసారి కూడా ఓడించాలి కదా. కానీ అలా జరుగలేదు. ప్రస్తుతం మన ఆట తీరు ఎలా ఉందన్న అంశాల మీదనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మన చేతిలో ఓడినప్పుడు అఫ్గన్‌ అప్పుడప్పుడే ఎదుగుతున్న జట్టు. కానీ ఇప్పుడు వాళ్లు ఎంతో పరిణతితో ఆడుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. పెద్ద జట్లను ఓడించే స్థాయికి అఫ్గనిస్తాన్‌ చేరుకుందన్న విషయం మరవద్దు’’ అని పేర్కొన్నాడు. కాగా అబుదాబి వేదికగా టీమిండియా- అఫ్గన్‌ మధ్య మ్యాచ్‌కు ఇరు జట్ల ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు

చదవండి: T20 WC 2021: 'ప్రపంచకప్‌ మాదే' అన్న పాక్‌ అభిమాని.. స్టువర్ట్‌ బ్రాడ్‌ సూపర్‌ రిప్లై

మరిన్ని వార్తలు