IND Vs PAK T20 WC 2022: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం

19 Oct, 2022 09:02 IST|Sakshi

చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌ వేదికగా ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టి20 ప్రపంచకప్‌ ఆరంభమైనప్పటికి ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరుతోనే వరల్డ్‌కప్‌ పీక్‌స్టేజీకి చేరుకోనుందడంలో సందేహం లేదు.

తాజాగా హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌(డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్‌ 'ది రాక్‌') డ్వేన్‌ జాన్సన్‌ టీమిండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ డీసీ సూపర్‌ హీరో ప్రస్తుతం తన సినిమా బ్లాక్‌ ఆడమ్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్‌ 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ తన సినిమా ప్రమోషన్‌ కోసం స్టార్‌ స్పోర్ట్స్‌ చానెల్‌తో ఒప్పందం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే స్టార్‌స్పోర్ట్స్‌ యాజమాన్యం టీమిండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌పై డ్వేన్‌ జాసన్‌ చేసిన వ్యాఖ్యలను వీడియో రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం రాక్‌ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ''ఇద్దరు గొప్ప ప్రత్యర్థులు తలపడుతున్నారంటే ప్రపంచం మొత్తం ఆ ఇద్దరినే చూస్తుంది. టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య జరిగేది ఒక మ్యాచ్‌ కాదు.. అంతకుమించి. ఇట్స్‌ టైమ్‌ ఫర్‌ ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌. డోంట్‌ మిస్‌'' అంటూ డ్వేన్‌ జాసన్‌(ది రాక్‌) పేర్కొన్నాడు).

ఇక ఐసీసీ మేజర్‌ టోర్నీల్లో(వన్డే వరల్డ్‌కప్‌, టి20 ప్రపంచకప్‌) పాకిస్తాన్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన ఏడుసార్లు టీమిండియాదే విజయం. ఇక టి20 ప్రపంచకప్‌లోనూ ఆరుసార్లు తలపడితే టీమిండియా నాలుగుసార్లు, పాక్‌ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియా పాకిస్తాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

చదవండి: 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం'

'ఎంపిక చేయలేదన్న కోపమా.. కసిని చూపించాడు'

మరిన్ని వార్తలు