Virat Kohli:: ఓటమికి చింతిస్తున్నాం.. ఇక ఇంటికే.. ‘కోహ్లి ట్వీట్‌’ వైరల్‌

1 Nov, 2021 12:14 IST|Sakshi

వైరల్‌ అవుతున్న కోహ్లి పాత ట్వీట్‌

ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉందంటూ నెటిజన్ల కామెంట్లు 

Sad For Loss Going Home Now Virat Kohli Old Tweet Goes Viral: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో ముందుకు సాగాలన్నా.. సెమీస్‌ రేసులో నిలవాలన్నా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు చేతులెత్తేసింది. ఈవెంట్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన కోహ్లి సేన... అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవం మూటగట్టుకుంది. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పూర్తిగా విఫలమై 8 వికెట్ల తేడాతో పరాజయం చెందింది.

దీంతో సెమీస్‌ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించకపోయినా... ముందుకు వెళ్లాలంటే ఇతర జట్ల జయాపజయాలమపై ఆధారపడాల్సి దుస్థితి.ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన పాత ట్వీట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘ఓటమికి చింతిస్తున్నాం. ఇక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం’’ అని కోహ్లి 2011, జనవరి 23న ట్వీట్‌ చేశాడు.  ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టు పరిస్థితికి ఇది అద్దం పడుతోందంటూ పలువురు తాజా ఓటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

కాగా 2010-11 దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఒక టీ20, 5 వన్డేలు ఆడింది. ఇందులో చెరో టెస్టులో గెలవగా, ఆఖరిది డ్రాగా ముగిసింది. ఇక ఏకైక టీ20 మ్యాచ్‌లో ధోని సేన విజయం సాధించింది. వన్డేల్లో మాత్రం రెండు మాత్రమే గెలిచి ఓటమితో పర్యటన ముగించింది. ఈ క్రమంలో కోహ్లి ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడిది వైరల్‌ అవుతోంది.

ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌లను ఓపెనర్లుగా దించిన కోహ్లి వ్యూహం బెడిసికొట్టింది. టాపార్డర్‌ కుప్పకూలడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమై.. ఆపై కివీస్‌ను కట్టడి చేయలేక చతికిలపడింది. ఫలితంగా అద్భుత విజయం సాధించిన విలియమ్సన్‌ బృందం.. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

చదవండి: Virat Kohli On India Loss: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం..

మరిన్ని వార్తలు