T20 WC 2022: అతడు మరీ అంత బ్యాడ్‌ ఛాయిస్‌ కాదు! ప్రపంచకప్‌ జట్టులో ఉంటే..

2 Aug, 2022 13:59 IST|Sakshi
పార్థివ్‌ పటేల్‌(PC: Parthiv Patel Twitter)

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌-2022 నేపథ్యంలో భారత జట్టులో మహ్మద్‌ షమీకి స్థానం కల్పిస్తే బాగుంటుందని టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అన్నాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు షమీ కూడా జట్టులో ఉండేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్‌ టోర్నీలో అనుభవజ్ఞులైన ఈ పేస్‌ త్రయంతో బరిలోకి దిగితే మెరుగైన ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డాడు.

ప్రయోగాలు చేస్తున్న టీమిండియా!
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో ముందుకు సాగుతామన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ప్రపంచకప్‌ ప్రణాళికల్లో భాగంగా పలు ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. 

యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. ముఖ్యంగా హర్షల్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ వంటి ఫాస్ట్‌ బౌలర్లను మెగా ఈవెంట్‌కు సన్నద్ధం చేసే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షమీకి అవకాశం ఇవ్వాలంటూ పార్థివ్‌ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.


మహ్మద్‌ షమీ(PC: BCCI)

ఐపీఎల్‌లో అదరగొట్టిన షమీ! అయినా..
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో షమీ.. ఆరు వికెట్లు(ఎకానమీ 9.57) పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌-2022లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్‌ టైటిల్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత టీమిండియా తరఫున టీ20ల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్‌ షమీకి సూట్‌ కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

మరింత మెరుగయ్యాడు!
ఈ నేపథ్యంలో పార్థివ్‌ పటేల్‌ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌ ప్రదర్శనతో దినేశ్‌ కార్తిక్‌ టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు. నిజానికి మహ్మద్‌ షమీ కూడా ఐపీఎల్‌లో అదరగొట్టాడు. గుజరాత్‌ టైటాన్స్‌కు ట్రోఫీ అందించాడు. గత ప్రపంచకప్‌ మ్యాచ్‌ కంటే ఇప్పుడు మరింత మెరుగయ్యాడు.

కాబట్టి అతడు ఈసారి మరీ అంత బ్యాడ్‌ ఛాయిస్‌ ఏమీ కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా, భువీ, అర్ష్‌దీప్‌తో పాటు 31 ఏళ్ల షమీని మేనేజ్‌మెంట్‌ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఐపీఎల్‌-2022లో అదరగొట్టిన 37 ఏళ్ల దినేశ్‌ కార్తిక్‌ భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చి.. ఫినిషర్‌గా స్థానం సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు.
చదవండి: Suryakumar Yadav: ఇదే కొనసాగితే సూర్య కెరీర్‌ నాశనమవడం ఖాయం! తగ్గేదేలే అంటున్న రోహిత్‌! 

మరిన్ని వార్తలు