T20 World Cup: ఆ ఇద్దరిని ఎంపిక చేయాల్సింది: ఎమ్మెస్కే ప్రసాద్‌

24 Sep, 2021 14:25 IST|Sakshi
ఎమ్మెస్కే ప్రసాద్‌(ఫైల్‌ ఫొటో)

MSK Prasad On T20 World Cup Squad Selection: వచ్చే నెలలో మరో మెగా క్రికెట్‌ ఈవెంట్‌కు తెరలేవనుంది. యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సమరం మొదలుకానుంది. ఈ మేజర్‌ టోర్నీ కోసం ఇప్పటికే ప్రధాన దేశాలన్నీ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సైతం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, ఈ ఎంపికపై ఇప్పటికీ కొంతమంది మాజీ సెలక్టర్లు పెదవి విరుస్తున్నారు. యువ ఆటగాడు శ్రేయస్‌ అ‍య్యర్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ సెలక్టర్‌ సబా కరీం అభ్యంతరం వ్యక్తం చేయగా.. సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సైతం అసహనం వ్యక్తం చేశాడు.

టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు చోటు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్‌తక్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ టోర్నమెంట్లలో శిఖర్‌ ధావన్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అతడి సేవలు జట్టుకు అవసరం. అలాగే కృనాల్‌ పాం‍డ్యా కూడా.. గత రెండు, మూడేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో రాణిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌ జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. టీ20 జట్టును ఎంపిక చేసే సమయంలో సెలక్టర్లు ఈ విషయాలు ఆలోచించాల్సి ఉండాల్సింది. వీళ్లిద్దరినీ ఎంపిక చేయాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ధవన్‌ ప్రస్తుత సీజన్‌ అత్యధిక పరుగుల జాబితాలో 422 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. రాహుల్‌ చహర్‌ ఎంపిక నేపథ్యంలో ఎమ్మెస్కే మాట్లాడుతూ.. ‘‘టీమిండియా టీ20 బౌలర్లలో యజువేంద్ర చహల్‌ అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా వరుస మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో రాహుల్‌ చహర్ సైతం ఐపీఎల్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. వీరిద్దరి మధ్య పోటీ నెలకొన్నపుడు తాజా పర్ఫామెన్స్‌ను బట్టి సెలక్టర్లు చహర్‌ వైపు మొగ్గు చూపారు. ఈ ఎంపిక సైతం చర్చనీయాంశమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దుబాయ్‌లో అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌తో టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది.

చదవండి: IPL 2021: సన్‌రైజర్స్‌కు  బిగ్‌ షాక్‌.. ఇంటి దారి పట్టిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

>
మరిన్ని వార్తలు