T20 World Cup 2021: ట్రోఫితో పాటు ఆ రెండు రికార్డులు టీమిండియా క్రికెటర్లవే.. ఆసీస్‌ మాజీ పేసర్‌ జోస్యం

22 Oct, 2021 19:04 IST|Sakshi

Brett Lee Predicts Highest Run Scorer And Wicket Taker Of T20 World Cup 2021: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌-2021పై విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి రకరకాల అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న మెగా టోర్నీలో టీమిండియానే విజేతగా నిలువబోతుందని జోస్యం చెప్పాడు. అలాగే టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు, అత్య‌ధిక వికెట్ల రికార్డు కూడా టీమిండియా క్రికెటర్లే సొంతం చేసుకోనున్నట్లు ముందే తేల్చేశాడు. 


భారత విధ్వంసకర ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసే బ్యాట‌ర్‌గా నిలుస్తాడ‌ని, మ‌హ్మ‌ద్ ష‌మీ అత్య‌ధిక వికెట్లు పడగొట్టే బౌలర్‌గా అవతరిస్తాడని అంచ‌నా వేశాడు. గత కొంతకాలంగా వీరిద్దరు రాణిస్తున్న తీరును పరిగణలోకి తీసుకుని ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాడు. వీరిద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగితే టీమిండియా కప్‌ను ఎగరేసుకుపోవడం ఖాయమని తెలిపాడు. 


కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2021లో ఈ ఇద్దరు ఆటగాళ్లు పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు సారధిగా వ్యవహరించిన రాహుల్‌.. 13 మ్యాచ్‌ల్లో 62.60 సగటుతో 626 పరుగులు చేయగా, షమీ 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌, ఆసీస్‌లతో జరిగిన రెండు వార్మ‌ప్ మ్యాచ్‌ల్లో స‌త్తా చాటిన టీమిండియా మాంచి జోరు మీద ఉంది. ఇదే ఊపులో ఈనెల 24న దాయాది పాక్‌ను సైతం మట్టికరిపించాలని కోహ్లి సేన భావిస్తుంది.
చదవండి: అజేయ 'విరాట్‌'.. పాక్‌పై అదిరిపోయే రికార్డు కలిగిన టీమిండియా కెప్టెన్‌

మరిన్ని వార్తలు