-

T20 World Cup 2021: 2 ప్రపంచకప్‌లలో 2 వేర్వేరు దేశాలు.. చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్‌

19 Oct, 2021 17:14 IST|Sakshi

David Wiese  Played For Two Nations In Consecutive World Cups: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో నమీబియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్‌ వీస్‌ చరిత్ర సృష్టించాడు. వరుస ప్రపంచకప్‌లలో రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2016 ప్రపంచక‌ప్‌లో జన్మస్థలమైన దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన వీస్‌.. ప్రస్తుత వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో తన తండ్రి స్వస్థలమైన నమీబియా తరఫున ఆడుతున్నాడు. 36 ఏళ్ల సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన వీస్‌.. 2013లో దక్షిణాఫ్రికా తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అరంగేట్రం చేసి 6 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. గత టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున 3 మ్యాచ్‌లు ఆడిన వీస్‌.. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 

2019లో నమీబియా టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై కావడంలో కీలకపాత్ర పోషించిన వీస్‌.. నాటి నుంచి ఆ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సోమ‌వారం(అక్టోబర్‌ 18) శ్రీలంక‌తో జ‌రిగిన క్వాలిఫ‌యింగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన అతను.. కేవ‌లం 6 ప‌రుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా 96 పరుగులకే ఆలౌట్‌ కాగా.. శ్రీలంక కేవలం 3 వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో అన్నీ అనుకూలించి న‌మీబియా సూపర్‌ 12 స్టేజ్‌కి చేరితే.. అక్క‌డ దక్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డే అవకాశం ఉంది. 
చదవండి: ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన 'జార్వో' మళ్లీ వచ్చేశాడు..

మరిన్ని వార్తలు