T20 World Cup 2021: టీమిండియా నెట్‌ బౌలర్‌గా ఆవేశ్‌ఖాన్

12 Oct, 2021 20:08 IST|Sakshi
​​​​​​​Courtesy: IPL Twitter

Avesh Khan As Net Bowelr For Team India T20 WC 2021.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌ ఐపీఎల్‌ ముగిసిన తర్వాత యూఏఈలో ఉండనున్నాడు. టి20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి ఆవేశ్‌ ఖాన్‌ టీమిండియా నెట్‌బౌలర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఆవేశ్‌ఖాన్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా నెట్‌ బౌలర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆవేశ్‌ ఖాన్‌ కూడా నెట్‌బౌలర్‌గా రావడంతో ఆ సంఖ్య రెండుకు చేరింది. అయితే ఆవేశ్‌ ఖాన్‌ స్టాండ్‌ బై లిస్ట్‌ ప్లేయర్‌గా కూడా పరిగణిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

చదవండి: T20 World Cup 2021: మెంటార్‌గా ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు

Courtesy: IPL Twitter

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆవేశ్‌ ఖాన్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌కు పెట్టింది పేరు. 140 నుంచి 145 కిమీ వేగంతో వైవిధ్యమైన బంతులు విసరడం ఆవేశ్‌ ఖాన్‌ స్పెషాలిటీ. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌కు వెన్నుముకలా మారిన ఆవేశ్‌ ఖాన్‌ ఆ జట్టు తరపున ఐపీఎల్‌ 2021 సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. సీజన్‌లో అత్యధిక వికెట్ల పరంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండడంతో అత్యధిక వికెట్ల జాబితాలో తొలి స్థానానికి చేరే అవకాశం ఉంది.

ఇక ఆవేశ్‌ ఖాన్‌ ఐపీఎల్‌ 2021 తొలి అంచె పోటీల్లో అన్‌రిచ్‌ నోర్ట్జే, ఇషాంత్‌ శర్మలతో సమానంగా మెరుగ్గా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు కౌంటీ సెలెక్ట్‌ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో దురదృష్టవశాత్తూ టూర్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని యూఏఈకి చేరిన ఆవేశ్‌ ఖాన్‌ సెకండ్‌ఫేజ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన బౌలర్‌గా మారాడు.

Courtesy: IPL Twitter

మరిన్ని వార్తలు