T20 World Cup 2021: ‘పాకిస్తాన్‌తో తలపడే నా జట్టు ఇదే’.. అతడికి చోటివ్వని గౌతీ!

15 Sep, 2021 11:25 IST|Sakshi

Gautam Gambhir Team India XI for Pakistan Clash: దాయాది దేశాల మధ్య క్రికెట్‌ పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే అభిమానులకు పండుగే. ఈ రసవత్తరమైన పోరును వీక్షించేందుకు పనులన్నీ మానుకుని మరీ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారంటే అతిశయోక్తి కాదు. అయితే, అనేకానేక కారణాల వల్ల కేవలం మేజర్‌ టోర్నీల్లోనే టీమిండియా- పాకిస్తాన్‌ ముఖాముఖి తలపడే పరిస్థితి. అలాంటి సందర్భాల్లోనూ భారత జట్టే పైచేయి సాధించడం ఫ్యాన్స్‌కు మరింత మజాను అందిస్తుంది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా మరోసారి ఇలాంటి ఆసక్తికపోరుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి.

యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబరు 17 నుంచి ఈ మెగా టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 24న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మెన్‌ ఇన్‌ బ్లూ- మెన్‌ ఇన్‌ గ్రీన్‌ తలపడనున్నారు. వరల్డ్‌కప్‌ ఈవెంట్లలో ముఖాముఖి పోరులో 11 సార్లు గెలుపొందిన టీమిండియా విజయపరంపర కొనసాగించాలని భావిస్తుండగా.. ఒక్కసారైనా పైచేయి సాధించాలని పాకిస్తాన్‌ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో తలపడబోయే టీమిండియా జట్టు ఎంపిక గురించి మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతం గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా జట్టు ఇదే..
‘‘కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ ఓపెనర్లుగా ఉండాలి. విరాట్‌ కోమ్లి వన్‌డౌన్‌లో, సూర్యకుమార్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, భువీ, వరుణ్‌ చక్రవర్తి, షమీ.. ఇక పదకొండో ఆటగాడిగా బుమ్రా ఉండాలి’’ అని గౌతీ చెప్పుకొచ్చారు. టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మాత్రం తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

బీసీసీఐ ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.
స్టాండ్‌ బై ప్లేయర్స్‌: శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌. 

15 మందితో పాక్‌ టీ20 ప్రాబబుల్స్‌:
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్‌ కెప్టెన్‌), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.

చదవండి: T20 World Cup 2021: ‘ఇండియా, పాకిస్తాన్‌.. ఇంకా సెమీస్‌ చేరే జట్లు ఇవే’

మరిన్ని వార్తలు