Virat Kohli: వాళ్లు బాగా ఆడారు.. అయినా ఇదే చివరి మ్యాచ్‌ కాదు కదా

24 Oct, 2021 23:46 IST|Sakshi

Virat Kohli Comments After Loss To Pakistan: ‘‘మా ప్రణాళికను సరిగ్గా అమలు చేయలేకపోయాం. క్రెడిట్‌ అంతా డ్యూ(తేమ)దే. పాకిస్తాన్‌ ఈరోజు ఆడిన విధానం కూడా బాగుంది. బంతితో శుభారంభం అందుకున్నారు. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోవడం(తమ జట్టు ప్రదర్శనను ఉద్దేశించి) ఏవిధంగానూ చెప్పుకోదగ్గ విషయం కాదు. స్లోగా మొదలుపెట్టి.. తిరిగి పుంజుకోవడం కూడా అంత సులభమేమీ కాదు. 15-20 అదనపు పరుగులు రాబట్టాల్సింది. కానీ పాకిస్తాన్‌ బౌలర్లు మాకు ఆ అవకాశం ఇవ్వలేదు.

ఇక ఆరంభంలోనే మేం వికెట్లు తీయాల్సింది. కానీ వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తూ మాకు ఛాన్స్‌ ఇవ్వలేదు. అయితే, మా బలాబలాలేమిటో మాకు తెలుసు. స్లో బౌలర్‌ లేకపోవడం లోటు అనడానికి అంతగా ఆస్కారం లేదు. డ్యూ ఉన్నపుడు వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేరు. అయినా టోర్నమెంట్‌లో ఇది మొదటి మ్యాచ్‌... చివరిదైతే కాదు కదా’’... పాకిస్తాన్‌ చేతిలో ఘోర పరాభవం అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందన ఇది. ఓటమిని హుందాగా అంగీకరించిన కోహ్లి... తదుపరి మ్యాచ్‌లలో సత్తా చాటగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఇప్పటి వరకు పాకిస్తాన్‌తో జరిగిన 5 మ్యాచ్‌లలో టీమిండియాదే పైచేయి అన్న సంగతి తెలిసిందే. అయితే, ఆదివారం జరిగిన ఆసక్తికరపోరులో మాత్రం ఈ రికార్డుకు తెరపడింది. సమిష్టి కృషితో పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొంది భారత జట్టు ఆధిక్యాన్ని (5-1)తగ్గించింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: IND Vs Pak:  ఏంటి షాహిన్.. ఇంత హైపర్‌ యాక్టివా

మరిన్ని వార్తలు