T20 World Cup 2021: మెంటార్‌గా ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు..

12 Oct, 2021 19:50 IST|Sakshi

MS Dhoni Not Charging Anything For Serving As Team India Mentor: భారత టీ20 ప్రపంచకప్‌ జట్టుకు మెంటార్‌గా సేవలందించేందుకు గాను టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. తన సారధ్యంలో టీమిండియాను రెండుసార్లు జగజ్జేత(2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌)గా నిలిపిన మహేంద్రుడు.. భారత జట్టుకు సేవలందించడం తన బాధ్యతగా భావిస్తానని చెప్పాడని, అందుకుగాను ఎలాంటి ఫీజులు తీసుకోనని మెంటార్‌గా ఎన్నికైన నాడే స్పష్టం చేశాడని షా పేర్కొన్నాడు. దేశం కోసం ధోని కమిట్మెంట్‌ గొప్పదని షా ప్రశంసించాడు.

మెంటార్‌గా ధోనిని ఎంపిక చేయడం టీమిండియాకు కచ్చితంగా లాభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులోని సభ్యులందరికీ ధోని అంటే అమితమైన గౌరవముందని, కొత్త బాధ్యతల్లో ధోని తప్పక రాణిస్తాడని, అతని ఆధ్వర్యంలో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాలని యావత్‌ భారత దేశం ఆకాంక్షిస్తుందని తెలిపాడు. కాగా, ప్రస్తుతం ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలో సీఎస్‌కే మరోసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు కూడా చేరింది. అక్టోబర్‌ 15న ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిసిన వెంటనే అక్టోబర్‌ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. 
చదవండి: రైనా సహా ఆ ముగ్గురు విధ్వంసకర యోధుల ఖేల్‌ ఖతం..!

మరిన్ని వార్తలు