T20 World Cup 2021: ఆవిరైన భారత్‌, అఫ్గానిస్థాన్‌ ఆశలు.. సెమీస్‌కు న్యూజిలాండ్‌

7 Nov, 2021 19:23 IST|Sakshi

New Zealand qualified To Semis, Team India And Afghanistan Out Of Tourney: టీ20 ప్రపంచకప్‌-2021 నుంచి భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు నిష్క్రమించాయి. ఇవాళ(నవంబర్‌ 7న) కివీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూడడంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్ల సెమీస్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా న్యూజిలాండ్‌ సెమీస్‌కు దర్జాగా దూసుకెళ్లింది. ఈ విజయంతో గ్రూప్‌-2 నుంచి సెమీస్‌కు చేరే రెండో జట్టుగా న్యూజిలాండ్‌ నిలిచింది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలతో పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్‌ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌(3/17), టిమ్‌ సౌథీ(2/24), సోధి(1/13), మిల్నే(1/17), నీషమ్‌(1/24) అప్గాన్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. నజీబుల్లా జద్రాన్‌(48 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించకపోయుంటే అఫ్గాన్‌ ఈ మాత్రం స్కోర్‌ కూడా చేయలేకపోయేది. 

అనంతరం అఫ్గాన్లు నిర్ధేశించిన 125 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(42 బంతుల్లో 40 నాటౌట్‌; 3 ఫోర్లు), డెవాన్‌ కాన్వే(32 బంతుల్లో 36 నాటౌట్‌; 4 ఫోర్లు) కివీస్‌ను విజయతీరాలకు చేర్చారు. 3 వికెట్లతో సత్తా చాటిన ట్రెంట్‌ బౌల్ట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. 
చదవండి: టీమిండియాపై పాక్‌ గెలుపు.. సంబురాలు చేసుకున్న భార్యపై కేసు పెట్టిన భర్త
 

మరిన్ని వార్తలు