T20 World Cup: నువ్వసలు ఏం చేస్తున్నావు బాబర్‌.. టీమిండియాను చూసి నేర్చుకోండి

21 Oct, 2021 10:39 IST|Sakshi

Salman Butt Criticizes Pakistan For Showing Insecurities: వార్మప్‌ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌ జట్టు అనుసరిస్తున్న తీరును ఆ దేశ మాజీ క్రికెటర్‌ సల్మాన్‌ భట్‌ తీవ్రంగా తప్పుబట్టాడు. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా... ప్రాక్టీసు మ్యాచ్‌లలో కూడా అభద్రతా భావంతో ఆడటం ఏమిటని మండిపడ్డాడు. ఈ విషయంలో టీమిండియాను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చురకలు అంటించాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌... సోమవారం జరిగిన  వార్మప్‌ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. అయితే, బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 

ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ ఆజం చెరో 20 పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్‌ చేరారు. ఫఖార్‌ జమాన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి ఇతరులకు అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్... నిర్ణీత 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటీస్‌ను... వాన్‌ డెర్‌ డస్సెన్‌ సెంచరీతో మెరిసి.. జట్టును గెలిపించాడు. 

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లలో టీమిండియా ఘన విజయం సాధించింది. అందరు ఆటగాళ్లకు అవకాశమిచ్చి... అక్టోబరు 24 నాటి అసలు పోటీకి ముందు తుది జట్టు కూర్పుపై అవగాహనకు వచ్చింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ భట్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందించాడు. ‘‘వార్మప్‌ మ్యాచ్‌లను టీమిండియా సరిగ్గా ఉపయోగించుకుంది. ఐపీఎల్‌లో వాళ్ల ఆటగాళ్లు ఆడినప్పటికీ.. మరోసారి అందరికీ అవకాశమిచ్చి పరీక్షించింది. కానీ... పాకిస్తాన్‌కు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. 

ఒకవేళ ఒక స్థానంలో ఒకరు విఫలమైతే.. అక్కడ మరొకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ‘‘నువ్వు కెప్టెన్‌. నీ ప్లేయర్ల ఆటతీరును గమనించాలి. ఎవరు ఎలా ఆడగలరో, ఏ స్థానంలో పంపిస్తే ఫలితం ఉంటుందో పరీక్షించాలి. కానీ... అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఒకవేళ బాబర్‌, రిజ్వాన్‌ మొదటి ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరితే పరిస్థితి ఏంటి? దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో ఏం జరిగిందో చూశాం కదా..? అసలు మీరెలాంటి వ్యూహాలు రచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అంటూ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తీరును తప్పుబట్టాడు. కాగా అక్టోబరు 24న టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.  

చదవండి: T20 World Cup 2021 SL Vs IRE: 70 పరుగుల తేడాతో విజయం... సూపర్‌–12 దశకు శ్రీలంక అర్హత

మరిన్ని వార్తలు