T20 World Cup 2021: బుర్జ్​ ఖలీఫాపై మెరిసిన టీమిండియా జెర్సీ 

14 Oct, 2021 16:02 IST|Sakshi

Team India New Jersey Displayed On Burj Khalifa : టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే సరికొత్త జెర్సీకి సంబంధించిన చిత్రాలను ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌ 'బుర్జ్‌ ఖలీఫా'పై బుధవారం రాత్రి ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా అధికారిక కిట్ స్పాన్స‌ర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ ట్వీట్ చేస్తూ.. చరిత్రలో తొలిసారి టీమిండియా జెర్సీని ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై ప్రదర్శించారని పేర్కొంది. 'బిలియన్ చీర్స్ జెర్సీ'గా పిలువబడే ఈ జెర్సీని వంద కోట్ల మంది అభిమానుల చీర్స్ స్ఫూర్తితో త‌యారు చేశామ‌ని వెల్లడించింది. ఈ వీడియోలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు కొత్త జెర్సీలు ధరించి కనిపించారు.  

ఇదిలా ఉంటే, గతేడాది ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించిన సంగతి తెలిసిందే. బుర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం అదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్‌ల ఫొటోలను ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై ప్రదర్శించారు. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను సైతం ఈ టవర్‌పై ప్రదర్శించారు. కాగా, అక్టోబర్‌ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 24న టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది.
చదవండి: IND Vs PAK: 'మౌకా మౌకా'... అరె భయ్యా ఈసారైనా

మరిన్ని వార్తలు