T20 World Cup 2021: నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్‌కు కోహ్లి వార్నింగ్‌..!

16 Oct, 2021 20:24 IST|Sakshi

Virat Kohli Rishabh Pant Banter Ahead Of T20 World Cup 2021: రేపటి(అక్టోబర్‌ 17) నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో టోర్నీ ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ సరదా వీడియోను రూపొందించింది. ఇందులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ల మధ్య సరదా సంభాషణ జరుగుతుంది. వీడియో కాల్‌ మాధ్యమం ద్వారా నడిచే ఈ సంభాషణలో తొలుత కోహ్లి పంత్‌ను ఉద్దేశిస్తూ.. టీ20ల్లో సిక్సర్లే మ్యాచ్‌లను గెలిపిస్తాయని అంటాడు. అందుకు పంత్‌ స్పందిస్తూ.. నువ్వేం కంగారుపడకు భయ్యా, నేను రోజు ప్రాక్టీస్‌ చేస్తున్నా. 

ఇంతకుముందు కూడా వికెట్‌ కీపర్‌గా ఉన్న వ్యక్తే సిక్సర్‌ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్‌ అందించాడు అంటూ 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని విన్నింగ్‌ షాట్‌ను ఉద్దేశిస్తూ బదులిస్తాడు. ఇందుకు రిప్లైగా కోహ్లి.. నిజమే కానీ, ధోని భాయ్‌ తర్వాత అంతటి వికెట్‌కీపర్‌ భారత్‌కు ఇంకా దొరకలేదని సెటైర్‌ వేస్తాడు. అందుకు పంత్‌.. నేనూ టీమిండియా కీపర్‌నే కదా అంటాడు. దీంతో చిర్రెత్తిపోయిన కోహ్లి.. చూడు పంత్‌.. నువ్వు కాకపోతే చాలా మంది వికెట్‌కీపర్లున్నారంటూ వార్నింగ్‌ ఇస్తాడు. ఈ తతంగం మొత్తానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. జట్టులో స్థానం గురించి, జట్టుకు టైటిల్‌ అందించడం గురించి వీరిద్దరే మాట్లాడుకోవాలి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, రేపటి నుంచి ప్రారంభమయే మెగా టోర్నీలో తొలుత గ్రూప్‌-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జ‌రుగనున్నాయి. అనంతరం మేజర్‌ జట్ల మధ్య సూప‌ర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్‌ 23 నుంచి ప్రారంభమవుతాయి. అంతకుముందే భారత్‌.. ఇంగ్లండ్‌(అక్టోబర్‌ 18), ఆస్ట్రేలియా(అక్టోబర్‌ 20) జట్లతో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక, ఈ టోర్నీలో టీమిండియా లీగ్‌ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్‌ 24న పాక్‌తో, అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
చదవండి: అసలు ఇతను కపిల్‌ దేవేనా.. ఎంతలా మారిపోయాడో చూడండి..!

మరిన్ని వార్తలు