T20 WC 2022: వెస్టిండీస్‌కు చావోరేవో.. కివీస్‌తో టీమిండియా ఢీ

18 Oct, 2022 21:00 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో రేపు (అక్టోబర్‌ 19) కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-బిలో వెస్టిండీస్‌.. జింబాబ్వేతో చావోరేవో తేల్చుకోనుండగా.. ఫామ్‌ లేమితో సతమతమవుతున్న కివీస్‌.. వార్మప్‌ మ్యాచ్‌లో పటిష్టమైన టీమిండియాను ఢీకొట్టనుంది. తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ చేతిలో భంగపడ్డ కరీబియన్‌ జట్టు.. రేపు జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. లేదంటే ఆ జట్టుకు సూపర్‌-12 దశకు చేరుకునే అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. 

గ్రూప్‌-బి నుంచే రేపు మరో మ్యాచ్‌ జరుగనుంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్‌ టీమ్‌.. ఐర్లాండ్‌తో తలపడనుంది. ఐర్లాండ్‌ తమ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడటంతో ఆ జట్టుకు కూడా ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. మొత్తంగా రేపటి మ్యాచ్‌ల్లో గెలుపోటములపై సూపర్‌-12 బెర్త్‌లు ఆధారపడి ఉన్నాయి. స్కాట్లాండ్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానుండగా.. వెస్టిండీస్‌-జింబాబ్వే మ్యాచ్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది.

మరోవైపు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్ల మధ్య రేపు ఆఖరి వార్మప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి వార్మప్‌ గేమ్‌లో ఆతిధ్య ఆసీస్‌ను ఓడించి హుషారుగా ఉన్నా భారత్‌.. న్యూజిలాండ్‌తో, ఆఫ్ఘనిస్తాన్‌-పాకిస్తాన్‌తో, బంగ్లాదేశ్‌-సౌతాఫ్రికాతో తలపడనున్నాయి. వార్మప్‌ మ్యాచ్‌లైనప్పటికీ హోరహోరీగా సాగుతుండటంతో అభిమానులు వీటిపై అమితాసక్తి కనబరుస్తున్నారు.   

మరిన్ని వార్తలు