T20 World Cup 2022: ఎంత పనిచేశావు కోహ్లి.. ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే! వీడియో వైరల్‌

31 Oct, 2022 09:54 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్‌లో విఫలమైన భారత్‌.. అనంతరం ఫీల్డింగ్‌లో కూడా చేతులేత్తేసింది. ఇందుకు ఫలితంగా దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో సూర్య కుమార్‌ యాదవ్‌ మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.  40 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు. అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దక్షిణాఫ్రికాకు అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆరంభంలోనే బిగ్‌ షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌.. ఫామ్‌లో ఉన్న డికాక్‌, రౌసౌను ఔట్‌ చేశాడు. అనంతరం షమీ ప్రోటీస్‌ కెప్టెన్‌ బావుమాను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఈ సమయంలో మార్‌క్రమ్‌, మిల్లర్‌ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు.

ఈజీ క్యాచ్‌ విడిచిపెట్టిన కింగ్‌
విరాట్‌ కోహ్లి ఫీల్డ్‌లో ఎంత చురుక్కగా ఉంటాడో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు, రనౌట్‌లు చేసిన విరాట్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం చాలా సులభమైన క్యాచ్‌ను జారవిడిచాడు. ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన అశ్విన్‌ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌ మిడ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాక పోవడంతో బంతి నేరుగా విరాట్‌ కోహ్లి చేతికి వెళ్లింది.

ఈ క్రమంలో ఈజీ క్యాచ్‌ను విరాట్‌ డ్రాప్‌ చేశాడు. దీంతో ఒక్క సారిగా బౌలర్‌తో పాటు అందరూ షాక్‌కు  గురయ్యారు. వెంటనే షమీ ఓవర్‌లో మార్‌క్రమ్‌కు మరో అవకాశం కూడా లభించింది. సులభమైన రనౌట్‌ అవకాశాన్ని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ  మిస్‌ చేశాడు.

ఇలా రెండు సార్లు బతికిపోయిన మార్‌క్రమ్‌ హాఫ్‌ సెంచరీ సాధించి.. ప్రోటీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా కోహ్లి క్యాచ్‌ డ్రాప్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ నెటిజన్‌ స్పందిస్తే.. "ఎంత పనిచేశావు కోహ్లి.. ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ మలుపు తిరిగేది" అని కామెంట్‌ చేశాడు.


చదవండి: సూర్య బౌలర్ల మైండ్‌తో ఆటలు ఆడుకుంటాడు: పాక్‌ క్రికెటర్‌


 

మరిన్ని వార్తలు