T20 World Cup: అతడి పేరే ముందుగా కోహ్లి, ధోని, శాస్త్రికి గుర్తుకు వస్తుంది!

28 Sep, 2021 14:31 IST|Sakshi
ఆశిష్‌ నెహ్రా (Photo Source: Twitter)

Ashish Nehra Comments On Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా ఐపీఎల్‌-2021లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లు ఆడిన జడ్డూ 179 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 62(నాటౌట్‌). మొత్తంగా 33 ఓవర్లలో 226 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై విజయంలో జడేజా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జోరు మీదున్న రాహుల్‌ త్రిపాఠిని పెవిలియన్‌కు పంపిన అతడు... లక్ష్య ఛేదనలో వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 19వ ఓవర్లో మెరుపులు మెరిపించాడు. 

మొత్తంగా 8 బంతులు ఎదుర్కొని 22 పరుగులతో రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రానున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టు ఎంపిక నేపథ్యంలో జడ్డూ పేరే కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి, మెంటార్‌ ధోనికి జ్ఞప్తికి వస్తుందన్నాడు. ‘‘బ్యాట్‌.. బాల్‌తోనూ అతడు రాణిస్తున్నాడు. గత మ్యాచ్‌లో(కేకేఆర్‌) 4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులే ఇచ్చాడు. వికెట్‌ కూడా తీశాడు. బౌలర్‌గా తన పాత్ర ఏమిటో మరోసారి గుర్తుచేశాడు. 


Jadeja: Photo: IPL

ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే... గత రెండేళ్లుగా తను మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొన్నటి మ్యాచ్‌లోనూ ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. మనం ధోని, ఆండ్రీ రసెల్‌, కీరన్‌ పొలార్డ్‌ గురించి ఎక్కువగా చెప్పుకొంటాం కదా. ఇప్పుడు జడేజా కూడా అదే స్థాయిలో రాణిస్తున్నాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో.. సీఎస్‌కే తరఫున ఐపీఎల్‌లో బ్యాట్‌ ఝలిపిస్తున్న విధానం చూస్తున్నాం. తనను థర్డ్‌ స్పిన్నర్‌గా భావించినా.. ఇప్పుడు మాత్రం బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా తుది జట్టు ఎంపికలో తొలుత జడేజా పేరే కోహ్లి, శాస్త్రి, ధోని మదిలో మెదులుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. అతడు అద్భుతాలు చేయడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.

చదవండి: T20 World Cup: రంగంలోకి ఇమ్రాన్‌.. వాళ్లను తప్పించే అవకాశం.. షోయబ్‌, ఫఖార్‌ జమాన్‌కు..

మరిన్ని వార్తలు