T20 World Cup: కోహ్లి సేనకు అంత సీన్‌ లేదు.. మాకు అసలు పోటీనే కాదు: పాక్ మాజీ ప్లేయ‌ర్‌

5 Oct, 2021 15:47 IST|Sakshi

Abdul Razzaq Feels Team India Cant Compete With Pakistan: టీ20 ప్రపంచకప్‌-2021లో భారత్‌-పాక్‌ల మధ్య పోరు నేపథ్యంలో పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ టీమిండియాను మాన‌సికంగా దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేశాడు.  టీమిండియా అసలు తమకు పోటీనే కాదని.. కోహ్లి సేనకు అంత సీన్‌ లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ క్రికెటర్ల టాలెంట్‌ చాలా భిన్నమైందని.. అది టీమిండియా ఆటగాళ్ల దగ్గర మచ్చుకైనా లేదని అన్నాడు. భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ మెరుగైన ఆటగాళ్లను అందించిందని.. కపిల్‌ దేవ్‌ ​కంటే ఇమ్రాన్‌ ఖాన్‌ గొప్ప ఆల్‌రౌండర్‌ అని, వ‌సీం అక్ర‌మ్‌ లాంటి ప్లేయ‌ర్ భారత్‌లో పుట్టలేదని గొప్పలు పోయాడు. ఈ సందర్భంగా ఆయన భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక సిరీస్‌పై స్పందించాడు.  

ప్రస్తుత తరుణంలో భారత్‌-పాక్‌ల మధ్య సిరీస్‌ లేక‌పోవ‌డం లోటుగా ఉందని, అది క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతూ ఉంటే ఎవరి టాలెంట్‌ ఎంతో ప్రపంచానికి కూడా తెలిసేదని అన్నాడు. టీమిండియా ఆటగాళ్లతో పోలిస్తే పాక్‌ ప్లేయర్స్‌ ఒత్తిడిని ఎక్కువగా తట్టుకోగలరని, అది ఇటీవల జరిగిన మ్యాచ్‌ల ద్వారా నిరూపితమైందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన దాయాదుల పోరులో పాక్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకపోవడం విశేషం. త్వరలో ప్రారంభంకాబోయే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న భారత్‌-పాక్‌ల మధ్య రసవత్తర పోరు జరుగనున్న సంగతి తెలిసిందే.  
చదవండి: దాయాది దేశాల మ్యాచా? మజాకా? 10 సెకన్ల యాడ్‌కు రూ.30 లక్షలు!

మరిన్ని వార్తలు