T20 World Cup: ఇండియా- పాక్‌ మ్యాచ్‌ రద్దు చేసే వీలు లేదు.. ఆడాల్సిందే!

19 Oct, 2021 11:50 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

T20 World Cup India Pakistan Match: కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండియా- పాకిస్తాన్‌ టీ20 మ్యాచ్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. కశ్మీర్‌లో ముష్కరుల చర్యలను ఖండించిన ఆయన... ఐసీసీకి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ టోర్నీలో ఏదేని కారణాలతో ఓ జట్టుతో మ్యాచ్‌ ఆడలేమని తిరస్కరించడం సరికాదన్నారు. పోటీలో పాల్గొంటున్న జట్టుగా... నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఐసీసీ టోర్నీలో కచ్చితంగా ఆడాల్సిందేనని చెప్పుకొచ్చారు.

ఈ మేరకు రాజీవ్‌ శుక్లా మాట్లాడుతూ... ‘‘జమ్మూ కశ్మీర్‌లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే... ఐసీసీకి ఇచ్చిన కమిట్‌మెంట్‌ ప్రకారం.. ఏదేని ఒక జట్టుతో మేము మ్యాచ్‌ ఆడలేమని తిరస్కరించే వీలులేదు. ఐసీసీ టోర్నమెంట్‌లో కచ్చితంగా ఆడాల్సిందే’’ అని స్పష్టం చేశారు.

కాగా కశ్మీర్‌లో దాడుల నేపథ్యంలో టీ20 టోర్నీలో భాగంగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిర్వహణపై పునరాలోచన చేయాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సహా బిహార్‌ డిప్యూటీ సీఎం తార్‌కిషోర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్‌లో #banpakcricket ట్రెండ్‌ అవుతోంది. మరోవైపు.. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 24న జరిగే దాయాదుల పోరు కోసం క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

చదవండి: T20 World Cup: అసలు పోటీకి ముందు.. ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ!

మరిన్ని వార్తలు