T20 World Cup: టీమిండియాకు లక్కీ ఛాన్స్‌.. పాక్‌తో పోరుకు ముందు టాప్‌ జట్లతో మ్యాచ్‌లు..

18 Sep, 2021 16:24 IST|Sakshi

India To Face England And Australia In Warm Up Matches: టీ20 ప్రపంచక‌ప్‌లో పాక్‌తో జరిగే మహా సంగ్రామానికి ముందు టీమిండియా రెండు వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడ‌నుంది. మెగా టోర్నీలో భాగంగా కోహ్లి సేన అక్టోబ‌ర్ 24న దాయాది పాక్‌తో తలపడనుండగా, అంతకంటే ముందే అంటే అక్టోబ‌ర్ 18న ఇంగ్లండ్‌తో, 20వ తేదీన ఆస్ట్రేలియాతో వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు దృవీకరించాయి. యూఏఈ, ఒమ‌న్ వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్‌ అక్టోబర్‌ 17న ప్రారంభమై.. దుబాయ్‌ వేదికగా నవంబర్‌ 14న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 

ఈ టోర్నీలో తొలుత గ్రూప్‌-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు అక్టోబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 22 వరకు జ‌రుగనున్నాయి. అనంతరం మేజర్‌ జట్ల మధ్య సూప‌ర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్‌ 23న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మెగా పోరుతో ప్రారంభమవుతాయి. ఇక, ఈ టోర్నీలో టీమిండియా లీగ్‌ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్‌ 24న పాక్‌తో, అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
చదవండి: కోహ్లి వారసుడిగా రోహిత్‌తో పోలిస్తే అతనైతేనే బెటర్‌.. ఎందుకంటే..?

>
మరిన్ని వార్తలు