పొట్టి క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 501 పరుగులు..!

2 Nov, 2022 12:24 IST|Sakshi

టీ20 క్రికెట్‌లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) టీ20 ఛాలెంజ్‌ లీగ్‌ ఈ ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. పొట్టి క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 501 పరుగులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌లో ఈ స్థాయిలో పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. 

సీఎస్‌ఏ టీ20 ఛాలెంజ్‌ లీగ్‌లో భాగంగా టైటాన్స్‌-నైట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 501 పరుగులు సాధించాయి. గతంలో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్‌ (ఇరు జట్ల స్కోర్లు కలిపి) 497 పరుగులుగా ఉండింది. 2016లో సూపర్‌ స్మాష్‌ లీగ్‌లో భాగంగా సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌-ఒటాగో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఈ స్కోర్‌ సాధించాయి. ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగుల రికార్డు 2016లో భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 489 పరుగులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే, సీఎస్‌ఏ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌.. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (57 బంతుల్లో 162; 13 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఛేదనలో నైట్స్‌ సైతం అదే రేంజ్‌లో రెచ్చిపోయి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి, లక్ష్యానికి 41 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 36 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌ల జాబితాలో ఈ మ్యాచ్‌ మూడో స్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు