అమెరికాలో తొలిసారి ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌ 

15 Apr, 2021 11:09 IST|Sakshi

లుసాన్‌ (స్విట్జర్లాండ్‌): కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది దక్షిణ కొరియాలో జరగాల్సిన ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ రద్దయింది. అయితే ఈ ఏడాది ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తామని అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ప్రకటించింది. అమెరికాలోని హ్యూస్టన్‌ నగరం ఈ ఏడాది నవంబర్‌ 23 నుంచి 29 వరకు ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌ పోటీలకు వేదికగా నిలుస్తుందని ఐటీటీఎఫ్‌ వెల్లడించింది.

కాగా, 95 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌ పోటీలు అమెరికాలో జరగనుండటం ఇదే ప్రథమం. 1937లో అమెరికా ఏకైకసారి పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత అమెరికా మూడు కాంస్యాలు (1938, 1948, 1949), ఒక రజతం (1947) దక్కించుకుంది. 1949 తర్వాత అమెరికా మరోసారి టీమ్‌ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించలేకపోయింది.  

>
మరిన్ని వార్తలు