భారత అమ్మాయిల ‘హ్యాట్రిక్‌’

5 Oct, 2022 05:13 IST|Sakshi

యూఏఈపై 104 పరుగులతో విజయం

రాణించిన జెమీమా, దీప్తి శర్మ  

సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌): మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నమెంట్‌లో భారత జట్టు హ్యాట్రిక్‌ విజయం సాధించింది. మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా రోడ్రిగ్స్‌ (45 బంతుల్లో 75 నాటౌట్‌; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. దీంతో భారత అమ్మాయిల జట్టు 104 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ టోర్నీలో మహిళల జట్టుకిది వరుసగా మూడో విజయం.

ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన భారత అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (10), రిచా ఘోష్‌ (0), దయాళన్‌ హేమలత (2) నిరాశపరచడంతో భారత్‌ 20 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీప్తి, ఐదో వరుస బ్యాటర్‌ జెమీమా ధాటిగా ఆడారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. తదుపరి మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 7న పాకిస్తాన్‌తో తలపడుతుంది.

మరిన్ని వార్తలు