Rohit Sharma: 'సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్‌.. వరల్డ్‌కప్‌కు బలమైన జట్టే లక్ష్యంగా'

17 Jan, 2023 17:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే బుధవారం ఉప్పల్‌ లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లంకతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా కివీస్‌పై కూడా అదే ప్రదర్శన కనబరచాలని ఉవ్విళ్లూరుతుంది. కాగా మ్యాచ్‌కు ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గేమ్‌ప్లాన్‌ స్ట్రాటజీని మీడియాకు వివరించాడు. వివరాలు రోహిత్‌ మాటల్లోనే..

''బలమైన టీం తో ఆడుతున్నాం మా శక్తి సామర్ధ్యాలను పరీక్షించు కోవడానికి మాకు ఇది మంచి అవకాశం. గత సిరీస్ ఆడని ఇషాన్ కిషన్ కు ఈ సారి మిడిల్ ఆర్డర్‌లో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. వన్డే వరల్డ్‌కప్‌ వరకు బలమైన జట్టును తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక మహ్మద్‌ సిరాజ్‌కు ఉప్పల్‌ స్టేడియం హోంగ్రౌండ్‌. తొలిసారి హోమ్‌గ్రౌండ్‌లో వన్డే మ్యాచ్‌ ఆడుతున్న సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్‌.

గత రెండేళ్లుగా సూపర్‌ ప్రదర్శన కనబరుస్తున్న సిరాజ్‌ గ్రాఫ్‌ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్త బంతితో వికెట్లు తీస్తూ టీమిండియాకు బూస్టప్‌ ఇస్తున్నాడు. ఇది మాకు మంచి పరిణామం. ప్రస్తుతం సిరాజ్‌ మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. వరల్డ్ కప్ దగ్గరపడుతుండడంతో అతనిపై వర్క్‌లోడ్‌ కాస్త ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్‌ జట్టులో ప్రధాన బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. కచ్చితంగా రానున్న వన్డే వరల్డ్‌కప్‌లో అతను కీలకం కానున్నాడు.

ఇక రేపటి వన్డేలో జట్టు ఎలా ఆడాలనే దానిపై దృష్టి సారించాం. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉందన్న విషయం ఇప్పుడు ఆలోచించడం లేదు. మా శక్తి సామర్థ్యాలపై మాత్రమే మ్యాచ్‌ విజయం ఆధారపడి ఉంటుంది. స్పిన్నర్లు చహల్, అక్షర్ , షెహబాష్ ,కుల్దీప్ యాదవ్‌లు అందుబాటులో ఉన్నారు. మ్యాచ్‌ సమయానికి ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు లేదా ఒక స్పిన్నర్‌, నలుగురు పేసర్లు కాంబినేషన్‌పై ఆలోచిస్తాం. ఇక వన్డే వరల్డ్ కప్ జరగనున్న అక్టోబర్-నవంబర్  నెలలో  మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే మ్యాచ్‌ టైమింగ్‌ అనేది  మాచేతుల్లో  లేదు.. దానిని బ్రాడ్ కాస్టర్స్ డిసైడ్ చేస్తారు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు