లండన్‌లో టీమిండియా 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు; వీడియో వైరల్‌

15 Aug, 2021 18:04 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా బ్రిటీష్‌ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. లార్డ్స్‌ వేదికగా రెండో టెస్టు ఆడుతున్న టీమిండియా ఆదివారం తాము బస చేస్తున్న హోటల్‌ వద్ద స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు చేసుకుంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిలు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జట్టు సభ్యులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు, వారి కుటుంబసభ్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.  కాగా శ్రీలంక పర్యటన నుంచి ఇంగ్లండ్‌కు చేరుకున్న పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌లు కూడా ఈ వీడియోలో కనిపించారు.  ఈ ఇద్దరు తమ ఐసోలేషన్‌ పీరియడ్‌ను పూర్తిచేసుకుని జట్టుతో కలిసి ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే మూడవ టెస్ట్‌ సెలెక్షన్స్‌ కోసం అందుబాటులో ఉండనున్నారు.

ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆటలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం 29 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో  27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్‌ అయింది.

>
మరిన్ని వార్తలు