Rahane-Dravid: రహానే ఫామ్‌పై ఆందోళన వ్యర్థం: ద్రవిడ్‌

30 Nov, 2021 08:48 IST|Sakshi

Rahul Dravid Says Not Worry About Ajinkya Rahane Form.. న్యూజిలాండ్‌, టీమిండియా మధ్య జరిగిన తొలి టెస్టు ఆఖరి నిమిషంలో డ్రాగా ముగిసింది. టీమిండియా విజయం ఖాయమనుకున్న దశలో కివీస్‌ టెయిలెండర్లు రచిన్‌ రవీంద్ర, ఎజాజ్‌ పటేల్‌లు 52 బంతుల పాటు ఓపిగ్గా ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. కాగా మ్యాచ్‌లో రహానే కెప్టెన్‌గా సక్సెస్‌ అయినప్పటికి బ్యాట్స్‌మన్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 35.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

చదవండి: Ashwin Vs Nitin Menon: అంపైర్‌తో అశ్విన్‌ గొడవ.. అది మనసులో పెట్టుకొనేనా?

ఈ నేపథ్యంలో రహానే ఆటతీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కెప్టెన్‌ కాకపోయుంటే జట్టులో చోటు దక్కకపోయేదంటూ అభిమానులు ట్రోల్‌ కూడా చేశారు. కాగా తొలి టెస్టుకు దూరంగా ఉన్న కోహ్లి రెండో టెస్టుకు అందుబాటులోకి రానుండడంతో రహానేపై వేటు పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం రహానే ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌ ముగిసిన అనంతరం ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు.

"రహానే ఫామ్‌పై అందోళన వ్యర్థం. అతని బ్యాటింగ్‌పై మాకు నమ్మకముంది. గతంలో ఎన్నోసార్లు రహానే టీమిండియాను గట్టెక్కించిన సందర్భాలున్నాయి. ఈసారి విఫలమైనంత మాత్రానా అతని ఫామ్‌పై దిగులు పడాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్‌లో మంచి టెక్నిక్‌ కలిగిన రహానే అనుభవం ఇప్పుడు జట్టుకు అవసరం. రహానే ఫామ్‌లోకి తిరిగిరావడానికి ఒక్క మ్యాచ్‌ చాలు. ఇక ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టుకు సన్నద్దమవుతున్నాం. రహానే వేటు పడనుందా అనేది ఇప్పుడే చెప్పలేం. రెండో టెస్టుకు కోహ్లి తిరిగి రానున్న నేపథ్యంలో అతనితో చర్చల తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. ఇప్పటిరైతే రహానే తుది జట్టులో ఉంటాడని'' తెలిపాడు.

చదవండి: Ind Vs Nz: రెండో టెస్టులో రహానేపై వేటు.. ‘వైస్‌ కెప్టెన్‌’ ఏమన్నాడంటే.. 

మరిన్ని వార్తలు