దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు

31 May, 2021 16:45 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ ట్విటర్‌ వేదికగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. సైనీ.. తన హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్‌ మీద కూర్చోండి అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆ స్టంట్‌ చూసిన కొందరు సైనీని మెచ్చుకోగా మరికొందరు తీవ్రంగా దుయ్యబట్టారు.

క్రికెటర్ అయి ఉండి ఇంత బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తావా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కుర్రాళ్లు నిన్న ఆదర్శంగా తీసుకొని ప్రమాదాలు గురైతే బాధ్యులెవరని మరికొందరు మండిపడ్డారు. టీమిండియాకు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు.. కాస్త ఓవరాక్షన్‌ తగ్గించుకుంటే మంచిదని మరికొందరు చివాట్లు పెట్టారు. మరికొందరు స్పందిస్తూ.. ఎవరైనా సాధారణ యువకులు ఇలా చేస్తే ఊరుకుంటారా?' అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. 

కాగా, కొందరు నెటిజన్లు మాత్రం స్టంట్ అదిరిపోయిందంటూ సైనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతని సిక్స్ ప్యాక్ బాడీ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన సైనీ.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. అక్కడ కూడా  తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో కూడా సైనీకి మొండి చెయ్యే ఎదురైంది. 
చదవండి: టీమిండియా ఆ 42 రోజులు ఏం చేస్తుంది..?

మరిన్ని వార్తలు