34 ఏళ్ల తర్వాత టీమిండియా..రూట్‌ తొలిసారి

16 Feb, 2021 14:20 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఫలితంగా తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. తొలుత ఇంగ్లండ్‌కు 482 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించిన టీమిండియా.. ఆపై రూట్‌ సేనను రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూల్చి ఘనమైన గెలుపును అందుకుంది. ఇది టీమిండియా టెస్టు చరిత్రలో ఐదో పెద్ద విజయంగా రికార్డులకెక్కింది. 

ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. 1986లో  లీడ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 279 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. 34 ఏళ్ల తర్వాత అతి పెద్ద గెలుపును నమోదు చేసింది.  ఇక ఆసియా ఉపఖండంలో ఇంగ్లండ్‌కు పరుగుల పరంగా ఇదే అతి పెద్ద ఓటమి. అంతకుముందు ఆసియా ఉపఖండంలో జరిగిన మ్యాచ్‌ల ప్రకారం చూస్తే ఇంగ్లండ్‌కు అతి పెద్ద ఓటమి ఎదురైంది కూడా భారత్‌పైనే. 2016-17 సీజన్‌లో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 246 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

రూట్‌ తొలిసారి..
ఇక భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో జోరూట్‌ కనీసం హాఫ్‌ సెంచరీ సాధించకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ భారత్‌లో కనీసం ఒక ఇన్నింగ్స్‌ లో హాఫ్‌ సెంచరీ, అంతకంటే ఎక్కువ పరుగుల్ని సాధించిన రూట్‌ మొదటిసారి విఫలమయ్యాడు. ఇది రూట్‌కు భారత్‌లో ఎనిమిదో టెస్టు మ్యాచ్‌.  చెన్నై వేదికగా జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో రూట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేశాడు. 

ఇక్కడ చదవండి:

టీమిండియా భారీ విజయం

టీమిండియాకు ఒకటి.. ఇంగ్లండ్‌కు మాత్రం రెండు

మరిన్ని వార్తలు