ఈ రికార్డులు చూస్తే తెలుస్తుంది గబ్బా కథ!

18 Jan, 2021 14:56 IST|Sakshi

టీమిండియా ‘భారీ’గా కష్టపడాల్సిందే!

బ్రిస్బేన్‌: గబ్బా స్టేడియంలో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత్‌ ముందు ఆసీస్‌ గట్టి సవాల్‌ విసిరింది. తొలి ఇన్నింగ్స్‌ 33 పరుగుల ఆదిక్యంతో కలిపి ఓవరాల్‌గా 328 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు టీమిండియా ముందుంచింది. అయితే, ఇంకా ఒకరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటం.. ఆస్ట్రేలియా పేస్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇప్పుడు రహానే సేన ముందున్న పరీక్ష. తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ విఫలమైనా లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ రాణించడంతో భారత్‌ పోటీలో ఉంది. లేదంటే ఇప్పుడున్న టార్గెట్‌ కంటే మరో సెంచరీ పరుగుల లక్ష్యం మన ముందుండేది. వాషింగ్టన్‌ సుందర్‌ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌), శార్దూల్‌ ఠాకూర్‌ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసి ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 369. 
(చదవండి: కీలక వికెట్లు కూల్చిన సిరాజ్‌‌.. బుమ్రా ఆలింగనం)

ఛేదిస్తే రికార్డే
గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డు ఉంది. ఆ స్డేడియంలో ఆసీస్‌ 55 టెస్టులు ఆడగా.. 33 మ్యాచుల్లో విజయం సాధించింది. 13 టెస్టులను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక 1988లో వెస్టిండీస్‌తో పరాజయం తర్వాత ఇప్పటివరకు అక్కడ ఒక్క టెస్టులో కూడా ఆసీస్‌ ఓడిపోలేదు. మరోవైపు గబ్బాలో ఇప్పటివరకు అత్యధిక ఛేజింగ్‌ స్కోరు 236 కావడం గమనార్హం. 1951/52 లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆతిథ్య ఆసీస్‌ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అనంతరం 1975/76 లో మళ్లీ వెస్టండీస్‌ పైన ఆస్ట్రేలియా 219 టార్గెట్‌ ఛేదించింది.1982/83 లో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ 188 పరుగుల్ని ఛేదించింది. 1978/79లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాపై గెలుపొందింది. 2017/18లో ఆసీస్‌ 170 పరగుల టార్గెట్‌ ఛేదించి ఇంగ్లండ్‌పై గెలిచింది. ఈ రికార్డులను పరిశీలిస్తే భారత్‌ భారీగా పరుగులు సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. సిడ్నీ టెస్టు మాదిరిగా డ్రాగా దిశగా సాగినా ఈ పరిస్థితుల్లో భారత్‌కు అది విజయంతో సమానం!!
(చదవండి: ఆసీస్‌ ఆలౌట్‌, భారత్‌కు భారీ టార్గెట్‌)

మరిన్ని వార్తలు