సిడ్నీ: ఓటమి ఖాయమనుకున్న సిడ్నీ టెస్టులో టీమిండియా డ్రాతో గట్టెక్కింది. హనుమ విహారి, అశ్విన్ క్రీజులో పాతుకుపోవడంతో ఈ సక్సెస్ సాధ్యమైంది. లేదంటే 1-1తో సిరీస్లో సమంగా ఉన్న టీమిండియా వెనుకబడి పోయేదే! ఇక ఈ మ్యాచ్కు సంబంధించి భారత నాలుగో ఇన్నింగ్స్లో ఎక్కువ ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన ఓ రికార్డు లిఖించింది. 1979లో ఓవల్ మైదానంలో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 150.5 ఓవర్లు, 1948/49లో కోల్కతాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 136 ఓవర్లు, 1958/59లో ముంబైలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 131 ఓవర్లు, 1979/80లో ఢిల్లీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 131 ఓవర్లు, ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తాజా టెస్టులో టీమిండియా 131 ఓవర్లపాటు క్రీజులో నిలిచి ఆయా మ్యాచ్లను డ్రాగా ముగించింది.
(చదవండి: అనుష్క-కోహ్లి దంపతులకు కుమార్తె..!)
ఆసియా జట్టుగా అగ్రభాగంలో
ఇక సిడ్నీ టెస్టు ద్వారా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక ఓవర్లపాటు క్రీజులో నిలిచి మ్యాచ్లను డ్రా చేసుకున్న ఆసియా జట్లలో టీమిండియా అగ్రభాగంలో నిలిచింది. అంతకు ముందు కూడా భారత జట్టు 2014/15 సిరీస్లో సిడ్నీ వేదికపైనే నాలుగో ఇన్నింగ్స్లో 89.5 ఓవర్లపాటు కడవరకూ క్రీజులో ఉండి మ్యాచ్ను డ్రాగా ముగించింది. 2004లో శ్రీలంక జట్టు 85 ఓవర్లపాటు, 1980/81లో భారత్ అడిలైడ్ టెస్టులో 75 ఓవర్లపాటు క్రీజులో పాతుకుపోయి ఆసీస్ చేతిలో ఓటమిని తప్పించుకున్నాయి. ఇక 1980 తర్వాత మళ్లీ తాజా టెస్టులోనే భారత్ అన్నేసి ఓవర్లపాటు నాలుగో ఇన్సింగ్స్లో బ్యాటింగ్ చేసి డ్రాతో గట్టెక్కింది. కాగా, ఆస్ట్రేలియాతో సిడ్నీవేదికగా జరిగిన మూడో టెస్టును భారత్ డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. నిర్ణయాత్మక నాలుగో టెస్టు బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది.
(చదవండి: విహారి పోరాటం అదిరింది.. ఆసీస్ అలసింది)