Asia Cup 2022 IND VS PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సం‍దడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్‌ ప్రోమో

8 Aug, 2022 13:57 IST|Sakshi

విండీస్‌ టూర్‌ ముగిసిందో లేదో అప్పుడే భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందడి మొదలైంది. ఆసియా కప్‌ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులైన ఈ రెండు దేశాలు ఆగస్ట్‌ 28న తలపడనున్నాయి. దాయాదుల మధ్య హైఓల్టేజీ సమరానికి 20 రోజుల ముందుగానే వాతావరణాన్ని వేడెక్కించేందుకు టోర్నీ ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ ఆసక్తికర ప్రోమోను విడుదల చేసింది. 

ఇందులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాక్‌తో సమరానికి సై అన్నట్లుగా క్రీజ్‌లో కాలుదువ్వుతూ కనిపిస్తాడు. క్రికెట్‌ పరంగా భారత్‌-పాక్‌ల మధ్య ప్రత్యేక అనుబంధముందని, పాక్‌ జట్టులోనూ మంచి ఆటగాళ్లు ఉన్నారని రోహిత్‌ ఈ ప్రోమోలో ప్రస్తావిస్తాడు. భారత్‌ ఎనిమిదో సారి ఆసియా కప్‌ గెలవాలి, విశ్వవేదికపై భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడాలంటూ అభిమానుల్లో ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 

స్టార్‌ స్పోర్ట్స్‌ కొద్ది రోజుల ముందు కూడా రోహిత్‌ను హైలైట్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో హిట్‌మ్యాన్‌.. 140 కోట్ల మంది భారత అభిమానులు ‘‘ఇండియా.. ఇండియా’’ అని ముక్తకంఠంతో నినదిస్తుంటే వినడం కంటే గొప్ప అనుభూతి ఉండదని, ఆసియా కప్‌లో త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడిద్దాం రమ్మని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా విండీస్‌తో ముగిసిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.  
చదవండి: రోహిత్‌కు రెస్ట్‌.. కెప్టెన్‌గా హార్ధిక్‌.. మరో కొత్త ఓపెనింగ్‌ జోడీతో ప్రయోగం

మరిన్ని వార్తలు