Rishabh Pant: రిషబ్‌ పంత్‌కు శుభాకాంక్షల వెల్లువ.. నేడు 24వ పడిలో అడుగు పెట్టిన ఢిల్లీ కెప్టెన్

4 Oct, 2021 16:38 IST|Sakshi

Happy Birth Day Rishabh Pant: నేడు(అక్టోబర్‌ 4) 24వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, టీమిండియా డాషింగ్‌ ప్లేయర్‌ రిషభ్ పంత్‌కు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్‌-2021లో భాగంగా ప్రస్తుతం యూఏఈలో ఉన్న పంత్‌.. తన ఐపీఎల్‌ జట్టుతో పాటు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, ఐపీఎల్‌ సహచరులతో పాటు టీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐ, ఐసీసీ పంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పంత్‌ మున్ముందు క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

ఈ సీజన్‌ ఆరంభంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ సారధ్య బాధ్యతలను చేపట్టిన పంత్‌.. జట్టును సమర్ధవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో డీసీ.. ఇప్పవరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. పంత్‌ సేన నేడు టేబుల్‌ టాపర్‌ సీఎస్‌కేతో తలపడనుంది. ఇదిలా ఉంటే, 2017లో టీ20 ఫార్మాట్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పంత్.. మెల్లగా అన్నీ ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సహచర ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం కావడంతో అతను ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ సారధిగా కూడా నియమించబడ్డాడు.

కాగా, పంత్‌ ఈ స్థాయికి చేరుకునేందుకు అందరు సాధారణ క్రికెటర్లలానే ఎన్నో కష్టాలు పడ్డాడు. కెరీర్‌ ఆరంభం రోజుల్లో తన స్వస్థలం(ఉత్తరాఖండ్‌) నుంచి ఢిల్లీకి రోజు ప్రయాణించే వాడు. కొన్ని సందర్భాల్లో ఇంటి వెళ్లలేని పరిస్థితుల్లో ఢిల్లీలోని గురుద్వారాలో నిద్రించాడు. 2016 అండర్‌-19 ప్రపంచకప్‌ నుంచి అతని దశ తిరిగింది. ఆ టోర్నీలో నేపాల్‌పై ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ, నమీబియాపై సెంచరీ ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. 2016-17 రంజీ సీజన్‌లో పంత్‌ కెరీర్‌ కీలకమలుపు తిరిగింది. ఆ సీజన్‌లో అతను మహారాష్ట్రపై ట్రిపుల్‌ హండ్రెడ్‌, ఝార్ఖండ్‌పై 48 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: రెండు ఐపీఎల్‌ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్..

మరిన్ని వార్తలు