T20 WC 2022: టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా..

13 Sep, 2022 16:14 IST|Sakshi

ఆసియా కప్‌ టోర్నీలో నిరాశజనక ప్రదర్శన అనంతరం టీమిండియా మరో మెగాటోర్నీకి సిద్ధమైంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదిక పొట్టి ప్రపంచకప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ టైటిల్‌ అందుకోవడంలో విఫలమైన టీమిండియా.. ఈసారి టి20 వరల్డ్‌ కప్‌ కొట్టాలన్న సంకల్పంతో ఉంది. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లు టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుందని చెప్పొచ్చు. 

కాగా ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలకు టీమిండియా కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతూ వస్తోంది. తాజాగా టి20 ప్రపంచకప్‌కు కూడా టీమిండియా కొత్త జెర్సీలతో బరిలోకి దిగనుంది. ఈసారి టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే జెర్సీ కలర్‌ స్కై బ్లూగా ఉండనుంది. ఇలాంటి జెర్సీలు 2000 ఆరంభ సంవత్సరం నుంచి టీమిండియా ధరిస్తూ వచ్చింది.

2007లోనూ ఇదే తరహా నీలిరంగు జెర్సీలతో టి20 ప్రపంచకప్‌ ఆడి విశ్వవిజేతగా నిలిచింది. టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ జెర్సీ కిట్‌కు సంబంధించి చిన్న వీడియోనూ రిలీజ్‌ చేసింది. ''మీరు లేకుండా ఎలాంటి గేమ్‌ ఉండదు. మిమ్మల్ని చీర్‌అప్‌ చేయడానికి సరికొత్త జెర్సీతో వస్తున్నాం.'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. 

ఇక ఆసియా కప్‌ను నెగ్గలేకపోయిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. టి20 ప్రపంచకప్‌కు అంతా సిద్ధమైందని తెలిపాడు. ఎలాంటి షార్ట్‌కట్స్‌ లేకుండా వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తూ మ్యాచ్‌ల్లో విజయాలు అందుకుంటాం. అందుకు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో టి20సిరీస్‌లు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనున్నాయని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. 

టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్

స్టాండ్‌ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్‌ 

మరిన్ని వార్తలు