National Open Masters Athletics Championship 2022: తెలంగాణ అథ్లెట్లకు 8 పతకాలు

20 Jun, 2022 07:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఓపెన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్లు మెరిశారు. గుజరాత్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ అథ్లెట్లు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. మహిళల ప్లస్‌ 45 వయో విభాగంలో దివ్య బొల్లారెడ్డి 400, 800 మీటర్ల కేటగిరీల్లో రజత పతకాలు గెలిచింది. దివ్య 400 మీటర్ల దూరాన్ని 1ని:14.91 సెకన్లలో... 800 మీటర్ల దూరాన్ని 3ని:02.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల ప్లస్‌ 35 వయో విభాగంలో అష్లి గోపీ 110 మీటర్ల హర్డిల్స్‌లో రజతం, ట్రిపుల్‌ జంప్‌లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.

110 మీటర్ల హర్డిల్స్‌ రేసును గోపీ 21.02 సెకన్లలో ముగించి రెండో స్థానంలో... ట్రిపుల్‌ జంప్‌లో 9.88 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల ప్లస్‌ 45 వయో విభాగంలో కృతి కడాకియా 1500 మీటర్ల రేసును 6ని:51.56 సెకన్లలో ముగించి కాంస్యం గెల్చుకుంది. పురుషుల ప్లస్‌ 60 వయో విభా గం పోల్‌వాల్ట్‌లో బండారి భాస్కర్‌ రావు 1.60 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్యం... హైజంప్‌లో 1.05 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజతం నెగ్గాడు. పురుషుల ప్లస్‌ 60 వయో విభాగం హ్యామర్‌ త్రోలో మనోహర్‌ రావు (27.58 మీటర్లు) స్వర్ణం గెలిచాడు.
 

మరిన్ని వార్తలు