Wrestler Sushil Kumar: ‘సుశీల్‌పై కుట్ర జరిగింది’

27 May, 2021 04:13 IST|Sakshi

నిందితుడి లాయర్‌ పునరుద్ఘాటన  

న్యూఢిల్లీ: స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను హత్య కేసులో కొందరు కావాలనే ఇరికించారని, దీని వెనక పెద్ద కుట్ర ఉందని అతని తరఫు లాయర్‌ బీఎస్‌ జాఖడ్‌ అన్నారు. పోలీసు దర్యాప్తు జరుగుతున్న తీరును ప్రశ్నించిన ఆయన, సుశీల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, తాము చెప్పదల్చుకున్న అన్ని విషయాలను ఇప్పటికే కోర్టు ముందు ఉంచినట్లు స్పష్టం చేశారు. ‘పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోనే తప్పులు ఉన్నాయి.

ఘటన గురించి తెలిశాక ఛత్రశాల్‌ స్టేడియానికి వెళ్లి గాయపడిన ముగ్గురి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయగా వారెవరూ సుశీల్‌ దాడి చేసినట్లుగా చెప్పలేదు. కానీ సాగర్‌ చనిపోయాక మాత్రమే కిడ్నాపింగ్, మర్డర్‌ కేసు పెట్టారు. సుశీల్‌ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా. విచారణకు హాజరయ్యేందుకు నోటీసు కూడా సుశీల్‌ పేరిట కాకుండా అతని భార్య పేరిట పంపించడం నిబంధనలకు విరుద్ధం. ఇదంతా చూస్తుంటే సుశీల్‌పై కావాలనే కుట్ర చేసినట్లు అర్థమవుతోంది’ అని జాఖడ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు