Sourav Ganguly: కోహ్లికి షోకాజ్‌ నోటీసులు.. స్పందించిన గంగూలీ

22 Jan, 2022 18:24 IST|Sakshi

No Plan To Show Cause Virat Kohli Says Sourav Ganguly: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వాలనుకున్నానని జరుగుతున్న ప్రచారంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇవాళ స్పందించాడు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశాడు. అసలు కోహ్లికి నోటీసులు ఇవ్వాలన్న ఆలోచనే తనకు లేదని వివరణ ఇచ్చాడు. ఇలాంటి ఫేక్‌ వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 

కాగా, దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరేముందు వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై బీసీసీఐ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే గంగూలీ.. కోహ్లికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు, అతన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా అడ్డుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై గంగూలీ స్పందించడంతో ప్రచారానికి తెరపడింది. 

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్‌ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. దీనిపై అప్పట్లో పెద్ద రాద్దాంతమే జరిగింది. 

కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లిని వారించామని బీసీసీఐ.. అసలు తనను ఎవరూ సంప్రదించలేదని కోహ్లి ప్రెస్‌ మీట్లు పెట్టి మరీ వాతావరణాన్ని హీటెక్కించారు. దీంతో కోహ్లి- బీసీసీఐ మధ్య పెద్ద అగాదం ఏర్పడిందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్‌ సిరీస్‌ ఓటమి అనంతరం కోహ్లి.. టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో ఈ వార్తలు నిజమేనని బహిరంగ చర్చ కూడా సాగింది. ఇదే సమయంలో గంగూలీ.. కోహ్లికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. 
చదవండి: కోహ్లికి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ!

మరిన్ని వార్తలు