Thomas-Uber Cup: థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌లో భారత జట్లు శుభారంభం

9 May, 2022 07:56 IST|Sakshi

బ్యాంకాక్‌: ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు గ్రూప్‌ ‘సి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో 5–0తో జర్మనీపై నెగ్గగా... ఉబెర్‌ కప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్‌ ‘డి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో 4–1తో కెనడా జట్టును ఓడించింది.

జర్మనీతో పోటీలో తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 21–16, 21–13తో మాక్స్‌ వీస్‌కిర్చెన్‌ను ఓడించగా... రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–15, 10–21, 21–13తో జోన్స్‌ రాల్ఫీ–మార్విన్‌ సీడెల్‌ జోడీపై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 18–21, 21–9, 21–11తో కాయ్‌ ష్కాఫెర్‌పై గెలిచి భారత్‌కు 3–0తో ఆధిక్యాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్‌లో అర్జున్‌ –ధ్రువ్‌ జోడీ... ఐదో మ్యాచ్‌లో ప్రణయ్‌ కూడా నెగ్గ డంతో భారత్‌ 5–0తో జర్మనీని క్లీన్‌స్వీప్‌ చేసింది.  

సింధు అలవోకగా... 
కెనడాతో జరిగిన పోటీలో తొలి సింగిల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ పీవీ సింధు 21–17, 21–10తో 11వ ర్యాంకర్‌ మిచెల్లి లీపై 33 నిమిషాల్లో గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో శ్రుతి మిశ్రా–సిమ్రన్‌ సింగ్‌ జంట ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. అయితే ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో ఆకర్షి కశ్యప్‌ ... తనీషా–ట్రెసా జాలీ జంట... అష్మిత నెగ్గడంతో భారత్‌ 4–1తో విజయాన్ని దక్కించుకుంది. 

మరిన్ని వార్తలు