రెండో టీ20: భారత క్రికెట్‌ జట్టులో భారీ మార్పులు!

13 Mar, 2021 19:54 IST|Sakshi

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో అనవసరపు ప్రయోగాలు చేసి చావుదెబ్బ తిన్న భారత్‌.. రెండో టీ20 కోసం జట్టులో భారీ మార్పులు చేయాలని యోచిస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు(ఆదివారం) ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను తుది జట్టులోకి ఎంపిక చేయాలని జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి చేతులు కాల్చుకున్న భారత్‌.. ఈసారి జట్టు కూర్పు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలి మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపని లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌, పేసర్‌ శార్థూల్‌ ఠాగూర్‌ల స్థానాల్లో లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ రాహుల్‌ చాహర్‌, మీడియం పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదవండి: హార్దిక్‌ షాట్‌కు ఐసీసీ ఫిదా.. ఏమని పిలవాలి?

కాగా, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను రొటేషన్‌ పేరుతో తప్పించి.. టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ చేసిన తప్పిదమే భారత్ టీ20 సిరీస్‌లో చేస్తుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రోహిత్‌ శర్మ రీ ఎంట్రీ, రాహుల్‌, దీపక్‌ చాహర్‌లకు తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాల ప్రకారం చూసినా రోహిత్‌, రాహుల్‌ల జోడీకి ఓపెనర్లుగా మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వీరి జోడీ రెండో టీ20లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 44 పరుగులిచ్చిన చాహల్‌ స్థానంలో దేశవాళీ టోర్నీలో మంచి ఫామ్‌ను కనబర్చిన రాహుల్‌ చాహర్‌ను, తొలి మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయగలిగిన శార్థూల్‌ స్థానంలో పేసర్‌ దీపక్‌ చాహర్‌కు అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఇక్కడ చదవండి: ఆ రూల్‌ నీకు కూడా వర్తిస్తుందా.. కోహ్లిపై ధ్వజమెత్తిన వీరూ

మరిన్ని వార్తలు