టీమిండియా చీటింగ్‌ చేసి సిరీస్‌ గెలిచింది: పైన్‌

13 May, 2021 15:36 IST|Sakshi

సిడ్నీ: గతేడాది ఆసీసీ​ గడ్డపై జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీని టీమిండియా 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో సిరీస్‌ ముగిసి దాదాపు ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో ఆసీస్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమ దృష్టి మళ్లించడంతోనే సిరీస్‌ ఓడిపోయామంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. 

''టీమిండియా మమ్మల్ని పక్కదారి(సైడ్‌ షోస్‌) పట్టించిన విధానం సూపర్‌గా ఉంది. మూడో టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా మొదట గబ్బాకు వెళ్లమని చెప్పారు. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా నాలుగో టెస్టును ఎక్కడ నిర్వహించాలా అనే ఆలోచనలో పడింది. ఇంతలో ఏమైందో కానీ మళ్లీ మనసు మార్చుకొని గబ్బాలో ఆడుతామని టీమిండియానే పేర్కొంది. ఇలా మా ఏకాగ్రతను దెబ్బతీసేందుకే టీమిండియా మమ్మల్ని పక్కదారి పట్టించింది.

అందుకే మ్యాచ్‌పై సరిగ్గా దృష్టి పెట్టలేక ఓడిపోయాం.. అలా ఈ విషయంలో చీటింగ్‌ చేసి టీమిండియా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా ఎగురేసుకుపోయింది.'' అంటూ కామెంట్లు చేశాడు. కాగా టిమ్‌ పైన్‌ వ్యవహారంపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. ''దొంగల పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుందని.. సిరీస్‌ ముగిసిన వెంటనే ఎందుకు ఇలా అనలేదు... మీరు చేసే చీటింగ్‌లలో మేమెంత..'' అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు.  

ఇక అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయంతో టీమిండియా సిరీస్‌ను ఆరంభించింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటీ లీవ్స్‌పై స్వదేశానికి తిరిగి వచ్చేయడం.. పలువురు సీనియర్‌ ఆటగాళ్లు గాయపడడంతో టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవడం కష్టమేనని అంతా భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ రహానే సారధ్యంలో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘన విజాయన్ని సాధించింది. ఆ తర్వాత మూడో టెస్టు డ్రా చేసకున్నా.. గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకోవడమేగాక బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీని కూడా చేజెక్కించుకుంది. ఈ సిరీస్‌ మొత్తంగా చూసుకుంటే రిషబ్‌ పంత్‌, సుందర్‌, శుబ్‌మన్‌ గిల్‌, సిరాజ్‌లు అద్భుతంగా రాణించి సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర వహించారు.
చదవండి: WTC FInal: భారత్‌కు ‘సన్నద్ధతలేమి’ సమస్య కాదు

'చాలా థ్యాంక్స్‌.. మమ్మల్ని బాగా చూసుకున్నారు'

మరిన్ని వార్తలు