టిమ్‌ సౌథీ 'ఆరే'యడంతో న్యూజిలాండ్‌కు ఆధిక్యం

6 Jun, 2021 15:44 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ పట్టు బిగించింది. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో టామ్‌ లాథమ్‌ (30), నీల్ వాగ్నర్‌ (1) ఉన్నారు. ఇంగ్లీష్ బౌలర్ ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంకా ఆటలో ఒక్కరోజే మిగిలి ఉండటంతో మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా, వరణుడి దెబ్బకు మూడో రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. 

ఓవర్‌ నైట్‌ స్కోరు 111/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దారుణంగా దెబ్బ తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్‌కు పంపాడు. సౌథీకి మరో పేసర్ కైల్ జేమిసన్‌ (3/85) తోడవ్వడంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (132; 297 బంతుల్లో 16×4, 1×6) అద్భుత శతకానికి, కెప్టెన్‌ జో రూట్‌ (42), ఓలీ రాబిన్సన్‌ (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో ఇంగ్లండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. వీరితో పాటు ఇంగ్లండ్‌ జట్టులో ఓలీ పోప్‌(22), స్టువర్ట్ బ్రాడ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్‌ సాధించారు. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. డెవాన్‌ కాన్వే (200) డబుల్‌ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 10 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్ జట్లు రెండో టెస్టులో తలపడనున్నాయి. ఈ సిరీస్ అనంతరం కివీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది. జూన్‌ 18న ఇరు జట్లు సౌతాంప్టన్‌ వేదికగా ప్రతిష్టాత్మకమైన పోరులో తలపడనున్నాయి.
చదవండి: మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్‌ ఫ్రెండ్‌ ఉండేది

మరిన్ని వార్తలు