నేటి నుంచి ‘యూరో’

11 Jun, 2021 04:45 IST|Sakshi

తొలి పోరులో ఇటలీతో టర్కీ ఢీ

రోమ్‌: స్టార్‌ ఆటగాళ్లంతా పాల్గొనే ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్‌ టోర్నీ ‘యూరో కప్‌’కు రంగం సిద్ధమైంది. కరోనాతో గతేడాది వాయిదా పడిన ఈ మెగా ఈవెంట్‌ను ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. నేడు అర్ధరాత్రి 12.30  నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఇటలీతో టర్కీ తలపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఆతిథ్య దేశం కాకుండా 11 దేశాల్లో ఈ సారి యూరో కప్‌ నిర్వహిస్తుండటం విశేషం.

రోమ్‌ (ఇటలీ)లో మొదలయ్యే ఈ టోర్నీ రష్యా, అజర్‌బైజాన్, జర్మనీ, రుమేనియా, స్పెయిన్, నెదర్లాండ్స్, హంగేరి, డెన్మార్క్, స్కాట్లాండ్‌లలో లీగ్‌ మ్యాచ్‌లు జరుపుకొని ఇంగ్లండ్‌లో జూలై 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. రెండు సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా లండన్‌లోనే జరుగనున్నాయి. మొత్తం 24 జట్లు ఆరు గ్రూపులుగా తలపడనున్నాయి. మ్యాచ్‌ల్ని స్టేడియంలో ప్రత్యక్షంగా తిలకించే అవకాశముంది. కరోనా ప్రొటోకాల్‌ను అనుసరించి తీవ్రత తక్కువ ఉన్న దేశాల్లో అధిక సీట్ల సామర్థ్యంతో, వైరస్‌ తీవ్రంగా ఉన్న దేశాల్లో స్వల్ప సంఖ్యలోనైనా ప్రేక్షకుల్ని అనుమతిస్తున్నారు. టీవీలో ఈ మెగా టోర్నీని ‘సోనీ నెట్‌వర్క్‌’ ప్రసారం చేస్తోంది. తెలుగు ఫుట్‌బాల్‌ అభిమానుల కోసం ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ‘సోనీ టెన్‌ 4’ చానల్‌లో తెలుగులో వ్యాఖ్యానంతో తొలిసారి యూరో కప్‌ను ప్రసారం చేస్తున్నారు.  

ఎవరు ఏ గ్రూపులో...
టర్కీ, ఇటలీ, వేల్స్, స్విట్జర్లాండ్‌ (ఎ), డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, రష్యా (బి), నెదర్లాండ్స్, ఉక్రెయిన్, ఆస్ట్రియా, నార్త్‌ మెక్‌డోనియా(సి),  ఇంగ్లండ్, క్రొయేషియా, స్కాట్లాండ్, చెక్‌ రిపబ్లిక్‌ (డి), స్పెయిన్, స్వీడెన్, పొలండ్, స్లోవేకియా (ఇ),  
హంగేరి, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ (ఎఫ్‌). 

మరిన్ని వార్తలు