Ravi Kumar Dahiya: అరంగేట్రంలోనే అదరగొట్టావ్‌ రవి దహియా: సీఎం జగన్‌

5 Aug, 2021 18:04 IST|Sakshi

ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా ఫైనల్‌ పోరులో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. రష్యా రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్‌ 7-4 తేడాతో ఓడి రజతం గెలిచాడు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో సుశీల్‌ కుమార్‌ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులు ట్విటర్‌ వేదికగా రవి దహియాకు శుభాకాంక్షలు చెప్పారు.

కంగ్రాట్స్‌ రవి దహియా: సీఎం జగన్‌
టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో రజతం సాధించిన రవి దహియాకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి రెండో రజతం అందించిన నీకు శుభాకాంక్షలు.  అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే అదరగొట్టే ప్రదర్శన చేశావు. '' అంటూ ట్వీట్‌ చేశారు.

ఓడిపోయినా మనసులు గెలుచుకున్నావు: మోదీ
'' రవి కుమార్‌ దహియా ఒక గొప్ప రెజ్లర్‌.. ఫైనల్లో అతని పోరాట పటిమ నన్ను ఆకట్టుకుంది. అతని పోరాట స్పూర్తి.. మ్యాచ్‌ గెలవాలనే దృడత్వం అమోఘం. కానీ మ్యాచ్‌లో విజేత ఒకరే అవుతారు. దహియా.. నువ్వు ఈరోజు మ్యాచ్‌ ఓడిపోయుండొచ్చు.. కానీ మా మనసులు గెలుచుకున్నావ్‌.. రజతం సాధించిన నీకు శుభాకాంక్షలు.. నీ ప్రదర్శనతో దేశ గౌరవాన్ని మరింత పెంచావు'' అంటూ ట్వీట్‌ చేశారు.

''టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించావు.. మీ ప్రదర్శనను చూసి దేశం గర్విస్తుంది'' - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

''గ్రేట్‌ గోయింగ్.. రవి కుమార్‌ దహియా.. రజతం సాధించిన నీకు ఇవే నా శుభాకాంక్షలు.. మున్ముందు దేశానికి మరిన్ని పతకాలు తేవాలని కోరుకుంటున్నా''- రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు