Tokyo Olympics Day 11: ఈక్వెస్ట్రయిన్‌లో ఫౌద్‌ మీర్జా విఫలం

3 Aug, 2021 11:19 IST|Sakshi

ఈక్వెస్ట్రయిన్‌లో ఫౌద్‌ మీర్జా విఫలం
ఈక్వెస్ట్రయిన్‌ వ్యక్తిగత ఈవెంటింగ్‌ జంపింగ్‌లో భారత రైడర్‌ ఫౌద్‌ మీర్జా విఫలమయ్యాడు. ఓవరాల్‌గా ఆకట్టుకునే ప్రదర్శన చేసినా మెడల్‌ సాధించే ప్రదర్శనను మాత్రం ఇవ్వలేకపోయాడు,. ఫౌద్‌ మీర్జా 23వ స్థానంలో నిలవడంతో పతకం ఆశలు గల్లంతయ్యాయి. 

మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో భారత్‌కు నిరాశ
మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్స్‌ భారత్‌కు నిరాశే ఎదురైంది.ఫైనల్స్‌లో కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఆరోస్థానానికే పరిమితమైంది. ఒలింపిక్స్‌లో తొలిసారి డిస్కస్‌ త్రో విభాగంలో పతకం వస్తుందని కడవరకూ ఎదురుచూసినా చివరకు అది ఫలించలేదు.  ఈ ఫైనల్స్‌లో ఆరుసార్లు డిస్కస్‌ త్రో విసిరిన కమల్‌ప్రీత్‌.. మూడో ప్రయత్నంలో 63.70 మీటర్లు విసిరింది. ఫలితంగా ఆమె ఆరోస్థానానికి పరిమితమైంది. అమెరికా అథ్లెట్‌ అల్మన్‌ వాలరీ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్ల ప్రదర్శనతో పసిడిని గెలుచుకోగా, జర్మనీ అథ్లెట్‌ పుడెన్జ్‌ క్రిస్టన్‌ ఐదో ప్రయత్నంలో 66.86 మీటర్లతో రజతం, క్యూబా అథ్లెట్‌ పెరెజ్‌ యామి తొలి ప్రయత్నంలో 65. 72 మీటర్లు విసిరి కాంస్యాన్ని దక్కించుకుంది. 

ఫైనల్స్‌లో 1, 2, 3 స్థానాల్లో వరుసగా అమెరికా, జర్మనీ, క్యూబా.నిలిచి స్వర్ణ, రజత, కాంస్య పతకాల్ని గెలుచుకున్నాయి. ఈ పోరులో కమల్‌ప్రీత్‌ కౌర్ అత్యుత్తమ ప్రదర్శన 63.70గా నమోదైంది. 

ఈక్వెస్ట్రియన్‌ ఫైనల్లో భారత్‌..
ఈక్వెస్ట్రియన్‌ ఈవెంటింగ్‌ వ్యక్తిగత జంపింగ్‌ విభాగంలో ఫైనల్‌కు క్వాలిఫై అయిన భారత రైడర్‌ ఫౌద్‌ మీర్జా. 47.20 స్కోరు చేసి ఫైనల్‌కు క్వాలిఫై అయిన ఫౌద్‌ మీర్జా. 51 మంది పాల్గొన్న అశ్వ క్రీడ జంపింగ్‌ ఈవెంట్‌లో టాప్‌-25లో నిలిచిన ఫౌద్‌ మీర్జా ఫైనల్‌కు అర్హత సాధించాడు.

టోక్యో ఒలింపిక్స్‌: అథ్లెటిక్స్‌ మహిళల 200 మీ. హీట్స్‌ విభాగంలో భారత స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌ నిరాశ పరిచింది. ఓటమితో పరుగును ముగించింది.  

మహిళా హాకీ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 1-0 తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించి సెమీస్‌లోకి సగర్వంగా అడుగుపెట్టింది. మ్యాచ్‌ మొత్తానికి ఏకైక గోల్‌ చేసిన ప్లేయర్‌గా గుర్జీత్‌ కౌర్‌ నిలవగా.. సవితా పునియా అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. తద్వారా 41 ఏళ్ల తర్వాత క్వార్టర్స్‌ చేసిన భారత మహిళా జట్టు విజయం సాధించి.. సోమవారం నాటి 60 నిమిషాల ఆటను చిరస్మరణీయం చేసుకుంది. మరోవైపు పురుషుల హాకీ జట్టు సైతం సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే.

అప్‌డేట్స్‌:
షూటింగ్‌లో ముగిసిన పోరాటం
►50 మీ. మెన్స్‌ షూటింగ్ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ క్వాలిఫికేషన్‌లో భారత షూటర్లు నిరాశ పరిచారు. ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ 21వ స్థానం.. వెటరన్‌ సంజీవ్‌ రాజ్‌పుత్‌ 32వ స్థానంలో నిలిచారు. ఇక 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సౌరభ్‌ చౌదరి ఫైనల్‌ చేరినప్పటికీ.. ఏడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు.

అమ్మాయిలు చేసిన అద్భుతం: 

►ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన రాణి సేన.. ప్రపంచ నెంబర్‌ 2 ఆసీస్‌ను ఓడించి.. సెమీ ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. 

►నాలుగో క్వార్టర్‌లోనూ భారత మహిళ హాకీ జట్టు అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటోంది. గోల్‌ చేయకుండా ఆసీస్‌ను అడ్డుకుంటూ 1-0 ఆధిక్యాన్ని నిలుపుకొంటూ మహిళామణులు చక్కగా రాణిస్తున్నారు.

►మూడో క్వా‍ర్టర్‌లో భారత మహిళ హాకీ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే గోల్‌ చేసిన భారత్‌.. ఏ దశలోనూ పట్టు కోల్పోకుండా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా  అత్యవసరమైన సమయంలో గుర్జీత్‌ గోల్‌ చేయడం.. అదే విధంగా గోల్‌ కీపర్‌ సవిత ఆసీస్‌ను గోల్‌ కొట్టకుండా అడ్డుకోవడం ముచ్చట గొలుపుతోంది. 

►భారత మహిళల హాకీ జట్టు రెండో క్వార్టర్‌లో ఆధిపత్యం దిశగా దూసుకుపోతోంది. మైదానమంతా పాదరసంగా కదులుతూ మన అమ్మాయిలు పైచేయి సాధిస్తున్నారు. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న గుర్జీత్‌ కౌర్‌... గోల్‌ చేసి భారత్‌కు తొలి పాయింట్‌ అందించింది. ప్రస్తుతం భారత్‌ 1-0 తేడాతో ఆస్ట్రేలియాపై ఆధిక్యంలో ఉంది.

►తొలి క్వార్టర్‌లో భారత మహిళా హాకీ జట్టు మెరుగైన ఆటతీరు కనబరిచింది. ఆస్ట్రేలియా జట్టును నిలువరిస్తూ గోల్‌ చేయకుండా అడ్డుకుంది. ముఖ్యంగా తొలి 15 నిమిషాల పాటు భారత్‌ ఆధిపత్యం కొనసాగింది. ఈ క్రమంలో గోల్‌ లేకుండానే తొలి క్వార్టర్‌ ముగిసింది. ప్రస్తుతం ఇరు జట్లు 0-0తో సమంగా ఉన్నాయి.

►టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్‌లో సోమవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఐర్లాండ్‌ ఓటమితో... 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు చేరి భారత మహిళల జట్టు కొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఆస్ట్రేలియాను భారత్‌ ఏవిధంగా ఎదుర్కోనుందో నేడు తేలనుంది.


టోక్యో ఒలింపిక్స్‌లో నేటి మ్యాచ్‌లు
ఉ.7.24 గంటలకు అథ్లెటిక్స్‌ మహిళల 200 మీ. హీట్స్‌(ద్యుతిచంద్‌)
ఉ.8 గంటలకు పురుషుల 50 మీ., షూటింగ్ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ క్వాలిఫికేషన్
మ.1.20 గంటలకు పురుషుల 50మీ. షూటింగ్ రైఫిల్ ఫైనల్‌
మ.3.55 గంటలకు అథ్లెటిక్స్‌ మహిళల 200 మీ.హీట్స్ సెమీస్
సా.4.30 గంటలకు మహిళల డిస్కస్ త్రో ఫైనల్‌(కమల్‌ ప్రీత్‌ కౌర్‌)

అమ్మాయిలు అద్భుతం చేసేనా? 
ఒలింపిక్స్‌ హాకీలో తొలిసారి భారత మహిళల జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత ప్రస్థానం ముందుకు సాగుతుందో లేదో నేడు తేలిపోనుంది. నాకౌట్‌ మ్యాచ్‌ అయిన క్వార్టర్‌ ఫైనల్లో ఈరోజు పటిష్టమైన ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. పూల్‌ ‘ఎ’లో భారత్‌ లీగ్‌ దశలో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిలో ఓడింది. ఏడు గోల్స్‌ చేసి, 14 గోల్స్‌ సమర్పించుకుంది. మరోవైపు పూల్‌ ‘బి’లో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. 

మీ అభిప్రాయం చెప్పండిTokyo Olympics 2020: భారత్‌ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు?

మరిన్ని వార్తలు